Government School Wall Collapsed in Hussainapuram: కుప్పకూలిన ప్రభుత్వ పాఠశాల గోడ.. తప్పిన పెను ప్రమాదం - ap news
GovernmentSchool Wall Collapsed in Hussainapuram : ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లి మండలం ఎర్రగుడి పంచాయితీ హుస్సేనాపురంలో ప్రభుత్వ పాఠశాల భవనం గోడ ఒక్కసారిగా కూలింది. అప్పటిదాకా అక్కడే చదువుకున్న విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు 38 మంది విద్యార్థులు ఉండగా 28 మంది విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. పాత భవనం కావడంతో రెండు గదులకు మధ్యలో ఉన్న గోడ కూలి పోవడంతో పిల్లల పుస్తకాల సంచులు శిథిలాల్లో కలిసిపోయాయి. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
పాఠశాల భవనం బాగు చేసేందుకు నాడు-నేడు పథకం కింద నిధులు 12.5 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఆ నిధులను అధికారులు వెనక్కు పంపారు. శిథిలావస్థకు చేరిన గదుల్ని మరమ్మతులు చేయడం కంటే.. కొత్తవి కట్టడం మేలని ఉన్నతాధికారులకు ఎంఈవో నివేదిక పంపారు. దాంతో మరమ్మతులు చేపట్టకుండానే పాత భవనంలోనే విద్యార్థులు విద్యను కొనసాగిస్తున్నారు. ఎర్రగుడి టీడీపీ సర్పంచ్ వరలక్ష్మి పలుమార్లు మండల సర్వసభ్య సమావేశంలో పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని విన్నవించుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని తక్షణమే కొత్త భవనాలు నిర్మించాలని విద్యార్థుల తల్లిందండ్రులు కోరుతున్నారు.