Ganesh Immersion in Kurnool: కర్నూలులో కన్నుల పండువగా.. కొనసాగుతున్న వినాయక శోభాయాత్ర - వినాయక నిమజ్జనం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 26, 2023, 6:35 PM IST
Ganesh Immersion in Kurnool: కర్నూలులో వినాయకుని శోభాయాత్ర కన్నుల పండువగా సాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ప్రారంభమైన ఈ శోభయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడు నేడు నిమజ్జనానికి అంగరంగవైభవంగా బయలుదేరాడు. కర్నూలు పట్టణంలోని రాంబొట్ల దేవాలయం వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్. సృజన, ఎస్పీ కృష్ణ కాంత్ పూజ చేసి శోభాయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీతో పాటు తదితరులు పాల్గొన్నారు. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న యువత.. విగ్రహాల ముందు ఉత్సహంగా డ్యాన్సులు వేశారు. రాంబొట్ల దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం లడ్డును వేలం వెయ్యగా.. బీజేపీ నేత బైరెడ్డి శబరి రూ.2.6 లక్షలకు దాని తీసుకున్నారు. ఈ శోభయాత్ర కొండారెడ్డి బురుజు మీదుగా వినాయక ఘట్ వరకు కొనసాగుతుంది. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా కర్నూలులో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీంతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు.