By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 26, 2023, 9:56 PM IST
ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువత ఎన్నికల్లోకి రావాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
Former CBI JD Lakshminarayana Gives Clarity AP Elections 2024: ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే యువత ఎన్నికలలో పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును కచ్చితంగా వినియోగించూకోవాలని.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైందని తెలిపారు. ఓటు హక్కును వృథా చేయొద్దని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు జేడీ సమాదానాలు ఇస్తూ.. ఎన్నికల్లో యువత యవత భాగస్వాములు కావడంతోనే మార్పు సాధ్యమవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికలపై జేడీ స్పందించారు. తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి శిరీష అలియాస్ బర్రెలక్కకు తాను మద్దతు ప్రకటిస్తున్నానని తెలిపారు. ఆమెను గెలిపించాలని తెలంగాణ ప్రజలకు సూచించారు. ఓటింగ్ శాతం పెరిగితే రాజకీయాలలో ధన ప్రభావం తగ్గుతుందని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు.