Farmers' Subscriptions for Canal Resurfacing Works: వర్షాలు కురుస్తున్నాయి.. ఇప్పటికే కాలువల్లో పూడికతీత పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. అందుకోసం వైసీపీ ప్రభుత్వం పైసా కేటాయించలేదు. దీంతో చేసేదేమీ లేక రైతులు స్వచ్ఛందగా చందాలు వేసుకుని కాలువలో పూడికను తొలగించుకున్న పరిస్థితి అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో నెలకొంది. తుంగభద్ర ఎగువ కాలువ నుంచి వచ్చే 9వ ఉప కాలువ బొమ్మనహాళ్ మండలం కలుహోళ, విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం, పాల్తూరు, హావళిగి దిశగా వెళుతుంది. ఈ కాలువ కింద దాదాపు 3 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కాలువలో కంపచెట్లు విపరీతంగా పెరిగిపోయి.. పూడిక పేరుకుపోయింది. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ప్రభుత్వం చర్యలు చేపట్టింది లేదు. ఈ క్రమంలో ఆ కాలువలో సాగునీరు ముందుకు సాగడం కష్టంగా మారింది. దీంతో కాలువ పరిధిలోని ఆయా గ్రామాల రైతులు చందాలు వేసుకుని ప్రొక్లెయిన్తో పూడిక తొలగింపు పనులు ప్రారంభించారు. ఒక్కో రైతు ఎకరాల ప్రకారం చందాలు వేసుకుని.. 6 కిలోమీటర్ల మేర పూడికను తొలగించే దిశగా పనులు చేపట్టారు.