Farmers Protest Under TDP at Irrigation Office: సాగునీటి కోసం రైతుల ఆందోళన.. గుంటూరులో నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయం ముట్టడి - TDP Dhulipalla Narendra Fire on CM Jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 16, 2023, 1:15 PM IST
Farmers Protest Under TDP at Irrigation Office: కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ గుంటూరులోని నీటిపారుదల శాఖ ఎస్ఈ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయానికి వచ్చిన రైతులు అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. వ్యవసాయానికి సరిపడా సాగునీరు ఇవ్వని కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండిన వరిపంటను తీసుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పట్టిసీమ మోటర్లు పూర్తిస్థాయిలో ప్రారంభించి నీరు విడుదల చేస్తే పంటలను కాపాడవచ్చని తెలిపారు. అయితే చంద్రబాబుకు పేరొస్తుందనే కారణంతో అన్ని మోటర్లు ఆన్ చేయడం లేదని రైతులు విమర్శించారు. ఈ క్రమంలో కృష్ణా పశ్చిమ డెల్టాకు తక్షణమే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
"సాగునీరు లేక వేల ఎకరాల్లోని పంట ఎండిపోతోంది. వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. అధికారులు వచ్చి సమాధానం చెప్పేవరకు ఆందోళన కొనసాగిస్తాం." - ధూళిపాళ్ల నరేంద్ర, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే