Farmers Complaint to Police Against Father and Son: పంట కొని పైసలివ్వడం లేదు.. తండ్రీకుమారుడిపై పోలీసులకు రైతుల ఫిర్యాదు - ఏపీలో కృష్ణారెడ్డి సోమశేఖర్ రెడ్డి మోసాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 29, 2023, 5:53 PM IST
Farmers Complaint to Police Against Father And Son: అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్ గ్రామానికి చెందిన.. పప్పుశెనగ రైతుల్ని మోసం చేసిన తండ్రీకుమారుడిని అరెస్ట్ చేసి తమకు న్యాయం చేయాలని రైతులు ఫిర్యాదు చేశారు. తమ వద్ద నుంచి రూ. 15 కోట్ల విలువ చేసే పప్పుశెనగ కొనుగొలు చేశారని రైతులు వెల్లడించారు. డబ్బులు చెల్లించకుండా... 15కోట్ల రూపాయలతో తండ్రి, కుమారుడు కృష్ణారెడ్డి, సోమశేఖర్ రెడ్డి ఉడాయించారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ తండ్రి, కుమారుడు గత కొంత కాలంగా చుట్టుపక్కల గ్రామాల్లోని పప్పు శెనగ రైతుల నుంచి పంట కొనుగోలు చేస్తున్నారని... గతంలో సొమ్ములను సరిగానే చెల్లించేవారని.. అలా నమ్మించి పప్పుశెనగలు కొనుగొలు చేశారని పేర్కొన్నారు.
రైతుల ద్వారా కొనుగోలు చేసిన పప్పుశెనగల్ని బెలుగుప్పలోని గోదాంలో నిల్వ ఉంచారని.. ఈ మధ్యే శెనగలను రూ.15 కోట్లకుపైగా విక్రయించారని.. బాధిత రైతులు వెల్లడించారు. తీరా డబ్బులు అడిగితే వ్యాపారంలో నష్టాల వల్ల అప్పులయ్యాయని చెబుతున్నట్లు తెలిపారు. వ్యాపారంలో నష్టం వచ్చిందని సాకుతో దివాలా తీశామని, కోర్టు ద్వారా నోటీసులు పంపుతానని కృష్ణారెడ్డి, సోమశేఖర్ రెడ్డి చెబుతున్నారని రైతులు ఆరోపించారు. మోసం చేసిన తండ్రి, కుమారుడిపై కేసు నమోదు చేసి... తమకు రావల్సిన డబ్బులు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, బాధిత రైతులంతా... కనేకల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు.