అనంతపురంలో చిరుత సంచారం - రైతుపై దాడి - leopard Anantapur District
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 17, 2024, 4:38 PM IST
Farmer Injured in Leopard Attack :అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో చిరుత సంచారంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. రెండు నెలల క్రితం చిరుత దాడిలో మూడు మేకలు మృతి చెందాయి. ఈ సంఘటన మరువకు ముందే రైతుపై చిరుత దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని కళ్యాణదుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి చెందిన రైతు రామ్మూర్తి రోజులాగే గ్రామ శివారులో పొలానికి వచ్చారు. తన వ్యవసాయ పొలంలో వేరుశనగకు స్ప్రింక్లర్లు మారుస్తుండగా పక్కనే అటవీ ప్రాంతంలో ఉన్న చిరుత ఒక్కసారిగా వచ్చి రైతుపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. గాయపడిన రామ్మూర్తిని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించారు. చిరుత దాడిలో రైతుకు స్వల్ప గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పిల్చుకున్నారు. గ్రామస్థులు జరిగిన సంఘటన గురించి అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. అధికారులు వివరాలు సేకరించే పనిలో నిమగ్నం అయ్యారు. చిరుత సంచారంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.