By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 5:04 PM IST
మూడు రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించాలి - 10న ఛలో సీఎం క్యాంప్ ఆఫీస్ : డీవైఎఫ్ఐ
DYFI seeks immediate release of DSC notification:వైఎస్సార్సీపీ ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా ఇదిగో డీఎస్సీ, అదిగో డీఎస్సీ అంటూ నిరుద్యోగులను చేసిందని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామన్న ఆరోపించారు. జనవరి 10వ తేదీలోగా మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేకపోతే 10వ తేదీన చలో సీఎం క్యాంప్ కార్యాలయం కార్యక్రమాన్ని చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో రామన్న మాట్లాడారు.
రాష్ట్రంలో 1.88 లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట, కేవలం 1.69 లక్షల ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని రామన్న పేర్కొన్నారు. సుమారు 18,520 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. కేంద్రం చెబుతున్న లెక్కల ప్రకారం 40 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో 117 పేరుతో మరో 10 వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దు చేసిందని రామన్న ఆరోపించారు. మెగా డీఎస్సీ కోసం విద్యాశాఖ మంత్రి, అధికారులకు అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చామని తెలిపారు. తమ వినతులను మంత్రులు, అధికారులు పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి జగనన్నకే చెబుతామన్నారు.