By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 15, 2023, 6:41 PM IST
అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో వివాదం - 'ఎక్కడపడితే అక్కడ ఇస్తే ఎలా?'
Dispute Over Allotment of Alternative Plots to Amaravati Farmers:అమరావతికి భూములిచ్చిన కొందరు రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్ల కేటాయింపు వివాదాస్పదంగా మారింది. విజయవాడ సీఆర్డీఏ కమిషనర్ కార్యాలయంలో జరిగిన ఈ- లాటరీ తీరును రైతులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ-లాటరీలో కమిషనర్ సహా ముఖ్యమైన అధికారులు లేకుండా కిందిస్థాయి సిబ్బందితో మొక్కుబడిగా చేస్తే ఎలాగని ప్రశ్నించారు. స్పష్టమైన విధానం, పద్ధతి లేకుండా ఎక్కడబడితే అక్కడ ప్లాట్లు ఇస్తే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు పోటు ఉన్నవి, మారుమూల ప్రాంతాల్లో ప్లాట్లు ఇస్తే ఎలా తీసుకుంటామని నిలదీశారు. ఓ స్పష్టమైన విధానాలు, సందేహాల నివృత్తి వంటివి ఏవీ లేకుండా హడావుడిగా ఆలోచించుకునేందుకు కూడా సమయం ఇవ్వకుండా తమ చేతిలో ఓ కాగితం ఉంచి వెళ్లిపోమంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వారికి ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించేందుకు మొదట విడతలో 679 మంది రైతులకు వారి అంగీకారం కోరుతూ నోటీసులు ఇచ్చారు. తదుపరి రెండో పర్యాయం కూడా నోటీసులు జారీ చేశారు. అందుకుగాను ఇంతవరకు 44 మంది రైతులు ప్రత్యామ్నాయ ప్లాట్లు పొందేందుకు అంగీకారం తెలిపారు. రోడ్డు పోటు వంటి వాటిని పట్టించుకోకుండా తమకు నివాస స్థలాలు ఇస్తున్నారని లేఅవుట్లను కూడా సరిగా చూపించకుండానే కేటాయింపు విధానాన్ని పూర్తి చేయాలనేలా అధికారుల తీరు ఉందని ఆరోపించారు.