రాష్ట్రంలో రెండున్నర లక్షల కోట్ల భారీ కుంభకోణాలు - కార్పొరేట్ కంపెనీల్లో జగన్ పెట్టుబడులు : దేవినేని - బకింగ్ హాం కెనాల్ ను పరిశీలించిన ఉమ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 8, 2023, 12:34 PM IST
Devineni Uma Visit Damage Bridge : రాష్ట్రంలో ఇసుక, భూములు, మద్యం కుంభకోణాల్లో 2.55 లక్షల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. సీఎం జగన్ 24 వేల కోట్ల రూపాయలు కార్పోరేట్ కంపెనీలో పెట్టుబడి పెట్టారని దేవినేని తెలిపారు. ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో వర్షానికి కోతకు గురైన బకింగ్ హాం కెనాల్ పై రోడ్డును.. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని తెలియజేశారు.
గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు.. ఇప్పటికీ పూర్తి చేయలేని దుస్ధితి నెలకొని ఉందని జనార్దన్ వ్యాఖ్యానించారు. గతంలో 80 శాతం పనులను పూర్తి చేసిన.. మిగిలిన రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయలేక పోవడం జగన్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రోడ్డుపై మట్టిపోసి వదిలేయడంతో చిన్న వర్షానికే కొట్టుకు పోతుందని తెలిపారు. కనీసం తారు రోడ్డు వేయలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికి వదిలేసి.. టీడీపీ నాయకులపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.