సీసీ కెమెరాలో మీ వ్యవహారమంతా ఉంది! వాటిని బయటపెడితే, మీకు పెళ్లిళ్లు కావు! ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజి ప్రిన్సిపల్ వేధింపులు - gooty news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 3, 2023, 8:04 PM IST
Demand to Suspend Principal in Anantapur District అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థులు, అధ్యాపకులు కళాశాల ఆవరణలో బైఠాయించి ఆందోళన చేపట్టారు. కళాశాలలో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులతో దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసి.. కళాశాలకు మహిళా ప్రిన్సిపల్ను నియమించాలని డిమాండ్ చేశారు. మూడు రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ప్రిన్సిపల్ పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని విద్యార్థినిలు, అధ్యాపకులు వాపోతున్నారు. ప్రిన్సిపల్ విపరీత ప్రవర్తనలో తాము అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఆయన మాట్లాడే భాషను భరించలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మూడు రోజుల కిందట ప్రిన్సిపల్ వేధింపులు తట్టుకోలేక ఓ అధ్యాపకురాలు ఆసుపత్రి పాలైన ఘటనపై.. స్థానిక పోలిస్ స్టేషన్లో టీచర్లు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎలాంటి చర్య లేకపోవడంపై.. విద్యార్ధినులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రిన్సిపల్ తీరుపై అనేక సార్లు విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు సైతం రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. అయినప్పటికి ప్రిన్సిపల్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ మండిపడుతున్నారు. ప్రిన్సిపల్ని మార్చే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థినిలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.