వివేకా హత్యకేసులో నిందితుడిగా నా పేరు తొలగించండి - సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ - Viveka Murder Case
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 14, 2023, 7:55 PM IST
Dastagiri Petition in CBI Court: కడప జిల్లా మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో తనను నిందితుడిగా తొలగించాలని సీబీఐ కోర్టులో దస్తగిరి పిటిషన్ దాఖలు చేశారు. తనను సాక్షిగా మాత్రమే పరిగణించాలని పిటిషన్లో పేర్కొన్నారు. సీబీఐ మొదటి ఛార్జ్షీట్లో తనను సాక్షిగా చేర్చిందన్నారు. దస్తగిరి పిటిషన్పై సీబీఐ కోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది. కాగా ఈ పిటిషన్పై మిగతా నిందితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివేకా హత్య కేసులో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరిలు నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసులో దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే.
అతను అప్రూవర్గా మారే సమయంలో కూడా మిగతా నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దస్తగిరి కడప జిల్లాలోని లింగాల మండలం మురారి చింతలపల్లెకు చెందిన వ్యక్తి కాగా.. ఆయన పులివెందులకు వలస వచ్చి దాదాపు 30 సంవత్సరాలు అవుతోంది. అయితే అతను 2016 నుంచి 2018 వరకు.. వివేకా వద్ద కారు డ్రైవర్గా పని చేశారు.