By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2023, 10:05 PM IST
CPM on crops drying రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి.. ప్రభుత్వం వద్ద ముందస్తు ప్రణాళికలు లేకపోవడమే కారణం: సీపీఎం
CPM State Secretary Srinivasa Rao Fires on YSRCP: ప్రజారక్షణ పేరుతో సీపీఎం జాతాలు ప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి సోమవారం ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన ధ్యేయంగా ఈ జాతాలు కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో తీవ్రమైన కరువు నెలకొందని దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని సీపీఎం విమర్శించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖలో ముందస్తు ప్రణాళికలు లేకపోవడంవలనే.. పంట పొలాలకు నీరు లేక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల అమాయక రైతులు నష్టపోతున్నారని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కరువు మండలాలను ప్రకటించి రైతులకు నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నేరవేర్చాలన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను అందర్నీ క్రమబద్ధీకరించాలని.. సీపీఎస్ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. గిరిజన ప్రాంతాల్లోని పోడు భూములకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.