విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదనే అధికారుల ప్రకటన మోసపూరితం: సీహెచ్ బాబూరావు - విజయవాడ లేటెస్ట్ న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 4, 2023, 4:35 PM IST
CPM Leader Baburao on Electricity Charges Hike: వైసీపీ ప్రభుత్వం ప్రతి నెల సర్దుబాటు భారం మోపుతూ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటించడం మోసపూరితమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సీహెచ్ బాబూరావు మండిపడ్డారు. రాష్ట్రంలో దాదాపు ఐదేళ్లుగా వేలాది కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల భారం మోపారని ధ్వజమెత్తారు. విజయవాడ పాయకాపురంలో స్థానికులతో సమస్యలపై బాబూరావు చర్చించారు. ప్రతి నెల విద్యుత్ భారాలు పెరుగుతున్నాయని స్థానికులు బాబూరావు వద్ద వాపోయారు. భారాలు తగ్గించాల్సిన నేపథ్యంలో విద్యుత్ భారాలు పెరగటం గర్హనీయమని బాబూరావు అన్నారు. కార్పొరేట్ల దోపిడీ, పాలకుల అవినీతి ఫలితంగానే ఏపీలో విద్యుత్ బాదుడు అని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల ఆదాయ, వ్యయ నివేదికలను పూర్తిగా బహిర్గతం చేయకపోవడం శోచనీయమన్నారు.
"రాబోయే సంవత్సరంలో రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచటం లేదని విద్యుత్ శాఖ అధికారులు ప్రకటించడం మోసపూరితం. ప్రతి సంవత్సవం కళ్లకు కనపడకుండా దొడ్డిదారిలో ముక్క ముక్కలుగా వాయిదాల పద్ధతిలో విద్యుత్ బాదుడు సాగుతోంది. దానికి ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలని పేర్లు పెడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు ఐదేళ్లుగా ప్రజలపై వేలాది కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీల భారం మోపారు." - సీహెచ్ బాబూరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు