CPI Ramakrishna on Illegal Liquor Sales in AP: పురందేశ్వరి ఇచ్చిన 'మద్యం ఫిర్యాదు'పై.. కేంద్రం సీబీఐతో దర్యాప్తు చేయించాలి : సీపీఐ - అక్రమ మద్యం న్యూస్
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 9, 2023, 6:37 PM IST
CPI Ramakrishna on Illegal Liquor Sales in AP: రాష్ట్ర ప్రభుత్వం అక్రమ మద్యం అమ్మకాల ద్వారా రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఇచ్చిన ఫిర్యాదుపై.. కేంద్రం సీబీఐతో దర్యాప్తు చేయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ ఒక్కటే అనే అభిప్రాయం ప్రజల్లో ఉందని.. అది నిజం కాదని నిరూపించుకోవడానికైనా దర్యాప్తు నిర్వహించాలన్నారు. లిక్కర్ దందా అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచే జరుగుతోందని రామకృష్ణ ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం 100కోట్ల రూపాయలు.. ఆ స్కామ్లో పలువురు మంత్రులు, ఎంపీలు కూడా నిందితులుగా చేరి, వారికి బెయిల్ కూడా ఇంతవరకూ లభించలేదు. అలాంటిది ఆంధ్రాలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు కలిపి పోటీ చేయాలని జనం అభిప్రాయపడుతున్నారని అన్నారు. బీజేపీ సహకారంతోనే చంద్రబాబును అరెస్టు చేశారని, జగన్ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.