By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 11, 2024, 8:35 PM IST
'జగనన్న తోడు' నిధులు విడుదల చేసిన సీఎం
CM Jagan Releases Jagananna Thodu Funds:జగనన్న తోడు నిధులను ముఖ్యమంత్రి విడుదల చేశారు. చిరు వ్యాపారులకు 86 కోట్ల వడ్డీ లేని రుణాలతోపాటు 332 కోట్ల వడ్డీని రెన్యువల్ చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. వరుసగా ఎనిమిదో విడత నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లాల లబ్ధిదారులు, కలెక్టర్లతో ముఖ్యమంత్రి మాట్లాడారు.
నిరుపేద చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతివృత్తుల వారికి ఏటా 10 వేల చొప్పున సున్నా వడ్డీకి రుణాలు అందిస్తున్నారు. 3.95 లక్షల చిరు వ్యాపారులకు రూ.417.94 కోట్ల రుణాలు సహా సకాలంలో రుణాలు చెల్లించిన 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్ మెంట్ నిధులను విడుదల చేశారు. మొత్తం 431.58 కోట్లను బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేశారు. ఇప్పటి వరకు రుణాలు సకాలంలో చెల్లించిన 15.87 లక్షల లబ్ధిదారులకు ప్రభుత్వం 88.33 కోట్లు వడ్డీ చెల్లించిందని సీఎం తెలిపారు.