Child burnt alive: చెత్త తగలబెడుతుండగా పూరిళ్లకు నిప్పు.. చిన్నారి సజీవ దహనం - child burnt alive fire accident Palnadu district
Child burnt alive in SC Colony in Pedapalem: పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం పెదపాలెంలోని ఎస్సీ కాలనీలో దారుణం జరిగింది. పూరిల్లు దగ్ధమైన ఘటనలో ఏడాడి వయస్సు ఉన్న చిన్నారి సజీవ దహనమైంది. సమీప పంట పొలాల్లో వ్యర్ధాలు తగలబెట్టడంతో మంటలు వ్యాపించగా.. క్షణాల్లో 8 పూరి గుడిసెలు దగ్దమయ్యాయి. తొలుత ఓ పూరి గుడిసెకు మంటలు అంటుకోగా.. ఆ తరువాత పక్కనే ఉన్న ఇళ్లకూ మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో జెర్రిపోతు పల్లవి అనే ఏడాది వయసు ఉన్న చిన్నారి మృతి చెందింది. అగ్నికి ఆహుతైన చిన్నారి బూడిద చూసి తల్లి, స్థానికులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. పాపను కాపాడే క్రమంలో తల్లికి, పాప అమ్మమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేసినా వారు సమయానికి స్పందించలేదని.. అధికారులు కూడా రాలేదని గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంటల్లో గ్యాస్ సిలిండర్లు పేలుతున్నాయని అధికారులు తెలిపినా వారు స్పందించలేదని ఆరోపించారు. అగ్నిప్రమాదంలో చల్లూరి నిర్మల, తిరుపతమ్మ, గంటల పేరయ్య, శివప్రసాద్, కట్టా స్వామి, జడ లక్ష్మి, రామారావు, కోప్పూరి రమాదేవి పూరిల్లు, జడ సుందర రావు గడ్డివాము దగ్ధమైంది.