Chandrababu Selfie Challenge at KIA: కరవు నేలపై ఎవరైనా కియా పరిశ్రమను ఊహించారా..?: చంద్రబాబు - AP Latest News
Chandrababu visited Kia Industry: పెనుగొండ నియోజకవర్గంలో కియా కార్ల పరిశ్రమను తెలుగుదేశం అధినేత చంద్రబాబు సందర్శించారు. టీడీపీ హయాంలో వచ్చిన కియా కార్ల పరిశ్రమ వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి ఛాలెంజ్ విసిరారు. కరవు నేలపై ఎవరైనా కియా పరిశ్రమను ఊహించారా..? అని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాపై తనకున్న ప్రేమతోనే ఈ ప్రాజెక్టు తీసుకొచ్చానని వెల్లడించారు. 6 నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీరిచ్చామని తెలిపారు. రాళ్ల సీమలో కియా సిరులు పండిస్తోంది ఇది తెలుగుదేశం పార్టీ విజయమని పేర్కొన్నారు.
వైసీపీ అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్నో.. పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో చెప్పాలంటూ చంద్రబాబు ఛాలెంజ్ చేసారు. టీడీపీ హయాంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి గొల్లపల్లి ప్రాజెక్ట్ నుంచి కియా కార్ల పరిశ్రమ అవసరాలకు నీటి సరఫరా చేశామని గుర్తు చేసారు. రికార్డ్ సమయంలో దాదాపు 13 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు, కార్ల ఉత్పత్తి జరిగిందన్నారు. ఇటీవల 10 లక్షల కార్ల ఉత్పత్తి పూర్తి చేసుకున్న కియా అనంతపురం పరిశ్రమను అభినందించారు. కియా కార్ల అమ్మకాలు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నారు.