Chandrababu meet with fishermen: టీడీపీతోనే వెనకబడిన వర్గాలకు గుర్తింపు: చంద్రబాబు - development of backward communities
Chandrababu meet with fishermen : రాష్ట్రంలో 20 లక్షల మంది మత్స్యకారులు ఉంటే.. కేవలం లక్ష మందికి డబ్బులు ఇచ్చి జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వెనకబడిన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశమని చంద్రబాబు గుర్తు చేశారు. విశాఖ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. వేపగుంటలోని మీనాక్షి కన్వెన్షన్ సెంటర్లో మత్స్యకారుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి టీడీపీ నేతలు పాల్గొన్నారు. వెనకబడిన వర్గాలను గుర్తించిన ఏకైక పార్టీ టీడీపీ అని, ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు మాత్రమేనని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాజకీయంగా బీసీలను పైకి తీసుకురావాలని రిజర్వేషన్లు పెట్టారు. ఆ తర్వాత రిజర్వేషన్లను 33 శాతానికి పెంచితే.. ఇప్పుడున్న సైకో ప్రభుత్వం 27శాతానికి కుదించింది. మత్స్యకారుల కోసం అనేక సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టిన పార్టీ.. తెలుగుదేశం మాత్రమేనని చంద్రబాబు ఉద్ఘాటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొక్కుబడిగా కొంతమందికి డబ్బులు ఇచ్చి మత్స్యకారుల్ని మోసం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.