BJP Meenakshi Lekhi Comments : డిజిటల్ లావాదేవీల్లో భారత్ ముందంజ.. బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులు : కేంద్ర మంత్రి - Meenakshi Lekhi News
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 8, 2023, 4:17 PM IST
BJP Leader Meenakshi Lekhi Comments on Women's Reservation Bill :అన్ని ఆటంకాలను అధిగమించి పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మీనాక్షి లేఖి తెలిపారు. మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో విపక్షాలు ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేశాయని ఆరోపించారు. విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ ప్రభుత్వం అతి తక్కువ సమయంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించిందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జీ-20 (G-20) సదస్సు ప్రపంచ వ్యాప్తంగా మన దేశ ప్రతిష్టను పెంచిందని కొనియాడారు. దేశంలోని ప్రతి పౌరుడు జీ-20 సదస్సు చూసి గర్వపడుతున్నారని తెలిపారు.
డిజిటల్ లావాదేవీలు, సాంకేతిక పరిజ్ఞానం విషయంలో భారతదేశం ముందంజలో ఉందని మీనాక్షి లేఖి వివరించారు. ప్రస్తుతం చిరు వ్యాపారులు కూడా డిజిటల్ లావాదేవీలు (Digital Transactions) చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో 50 శాతం డిజిటల్ లావాదేవీలు మన దేశంలో జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. బ్యాంకింగ్ రంగంలో కేంద్ర ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందన్నారు. జన్ ధన్ ఖాతాలను పెద్ద సంఖ్యలో తెరవడం వల్ల వివిధ ప్రభుత్వ పథకాల తాలూకా లబ్ది ప్రజల ఖాతాలకే జమ అవుతుందని, ఈ కారణం వల్లే దేశంలో అవినీతి తగ్గిందన్నారు.