By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 21, 2023, 10:39 AM IST
|Updated : Dec 21, 2023, 11:51 AM IST
గిరిజన ప్రాంతాల్లో అక్రమ మైనింగ్పై గవర్నర్కు ఫిర్యాదు చేసిన కొత్తపల్లి గీత
BJP Leader Kothapalli Geetha complained to Governor: అరకు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని గిరిజన ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా- ఎలాంటి అనుమతులు లేకుండా ఖనిజ తవ్వకాలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొత్తపల్లి గీత ఆరోపించారు. చనిపోయిన వారి పేర్లతోనూ మైనింగ్ చేస్తున్నారని. ఈ మేరకూ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్నజీర్కు కొత్తపల్లి గీత ఫిర్యాదు చేశారు. విజయవాడ రాజ్భవన్లో బీజేపీ ప్రతినిధులతో కలిసి ఐదు పేజీల వినతిపత్రాన్ని అందజేశారు. ఎక్కడా పీసా సభలు నిర్వహించడం లేదని- పీసా చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు లేకుండా ఖనిజ తవ్వకాలు సాగిస్తున్నారన్నారు. గిరిజనులను బెదిరించి వారితో గంజాయి సాగు చేయిస్తున్నారని ఆమె ఆరోపించారు. అనేక మంది గిరిజనులు రాజమహేంద్రవరం, విశాఖ జైళ్లలో పేరోల్ కూడా లేకుండా మగ్గుతున్నారన్నారని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు.
గిరిజన ఉప ప్రణాళిక నిధులను దారిమళ్లిస్తున్నారని కొత్తపల్లి గీత ఆరోపించారు. గిరిజన ప్రాంతాల్లో నవజాత శిశు మరణాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. సరైన రహదారులు లేకపోవడంతో అంబులెన్సులు సైతం గిరిజన ప్రాంతాలకు సకాలంలో వెళ్లలేకపోతున్నాయని ఉదాహరణలతో సహా గవర్నర్కు వివరించారు. అంగన్వాడీ భవనాలు శిథిలమయ్యాయని- కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం కోసం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తూ అవినీతికి పాల్పడుతోందని కొత్తపల్లి గీత పేర్కొన్నారు. జలజీవన్ మిషన్ నిధుల ఖర్చులో అవినీతి చోటుచేసుకుందని తెలిపారు. చివరికి భద్రాచలం ఆలయ భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం వదిలపెట్టడంలేదన్నారు. తన విజ్ఞాపనపై గవర్నర్ సానుకూలంగా స్పందించారని- తన పరిధిలోని అంశాలపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు కొత్తపల్లి గీత మీడియాకు వివరించారు.