ఎస్టీలుగా గుర్తించాలని బెంతు ఒరియాల నిరసన - బెంతు ఒడియా ర్యాలీ
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 5:32 PM IST
Bentu Odia Caste Protest Rally in Ichapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో బెంతు ఒరియా సామాజిక వర్గం నేతలు తమను ఎస్టీలుగా గుర్తించాలని కవిటి బస్టాండ్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బెంతు ఒరియా కులస్తుల ప్రతినిధులు మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ ధ్రువీకరణ పత్రం లేని కారణంగా తమ వర్గాలకు చెందిన వారు ప్రభుత్వ పథకాలు, విద్యార్థులు విద్యా అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారుల చుట్టూ తిరిగి తమ సమస్యను విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
1983 వరకు తమకు బెంతు ఒరియా ఎస్టీ ధ్రువపత్రాలు జారీ చేశారని తెలిపారు. కానీ ఎక్కడో జరిగిన దుర్వినియోగానికి తమకు కుల ధ్రువీకరణ పత్రం నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం గెలుపొందిన పార్టీ తమకు న్యాయం చేస్తామని 30 ఏళ్లగా చెప్పడమే తప్ప చేసిందిలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు స్పందించి తమను ఎస్టీలుగా గుర్తించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఈ నిరసనను మరింత ఉద్ధృతం చేస్తామని పేర్కొన్నారు.