జగన్ తన సామాజిక వర్గాలతో ఇతర వర్గాలపై దాడి చేయిస్తున్నారు - దోచుకున్న సొమ్మంతా కక్కిస్తాం : అచ్చెన్న - Atchannaidu Comments on Jagan
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 28, 2023, 4:54 PM IST
Atchannaidu Fires On CM Jagan: సీఎం జగన్ తన సామాజిక వర్గ నేతలతో ఇతర సామాజిక వర్గాల నేతలపై దాడి చేయిస్తున్నారని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయడు మండిపడ్డారు. ఆదాయం వచ్చే శాఖల్లో తమ సామాజిక వర్గానికి చెందినవారినే నియమించుకున్నారని ధ్వజమెత్తారు. ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో తన బంధువులను నియమించుకోవడమే సీఎం పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మద్యం నిషేధిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. నాసిరకం పంపిణీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అచ్చెన్న ఆరోపించారు.
మద్యం దుకాణాల్లో ఎక్కడా డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారని మండిపడ్డారు. మద్యం తయారీ, పంపిణీ, విక్రయాల రూపంలో ఏటా వేల కోట్ల రూపాయలు కొట్టేస్తున్నారని ఆరోపించారు. పకృతి సహజంగా లభించే ఇసుకను చంద్రబాబు ఉచితంగా అందిస్తే.. జగన్ రెడ్డి మాత్రం వెంకటరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చి దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని.. దోచుకున్న సొమ్మంతా కక్కిస్తామని అన్నారు.