Amaravati Capital Farmers JAC: అమరావతి భూములను దోచుకునేందుకే.. సీఎం కొత్త నాటకానికి తెర - ఏపీ వార్తలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 8:25 PM IST
Amaravati Capital Farmers JAC:రాజధానిలో భూములు వేలం వేయడాన్ని న్యాయస్థానంలో ప్రశ్నిస్తామని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి సభ్యులు స్పష్టం చేశారు. అమరావతిలోని భూములను దోచుకునేందుకే ముఖ్యమంత్రి జగన్ కొత్త నాటకానికి తెర తీశారని రైతులు ఆరోపించారు. అమరావతి పరిరక్షణ నేతలు మందడంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్థలాలు కేటాయించిందని.. జగన్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత వాటిని తరిమేశారని ఆరోపించారు. రేపు వేలంలో భూములు కొనుక్కునే వారికి ఇదే గతి పడుతుందని రైతులు తెలిపారు. ఈ సంవత్సరం కౌలు డబ్బులు వేయకుండా.. వైసీపీ ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. రాజధాని ప్రాంతం 'శ్మశానం, ఎడారి' అన్న నేతలు ఇప్పుడు ఆ భూములను ఎలా వేలానికి పెడతారని ప్రశ్నించారు. భూములను పూర్తిగా సీఆర్డీఏ (CRDA) కి ఇంకా బదిలీ కాలేదని తెలిపారు. తమ భూములను ఎలా వేలం వేస్తారని రైతులు నిలదీశారు.