YS Avinash Reddy : వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ అధికారులు కీలక విచారణకు రంగం సిద్ధం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్రెడ్డిని సీబీఐ అధికారులు మొదటిసారి ప్రశ్నించబోతున్నారు. అవినాష్ రెడ్డికి అందించిన నోటీసుల ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి అవినాష్ వెళ్లనున్నారు. ఇందుకోసం ఒకరోజు ముందే ఆయన హైదరాబాద్కు చేరుకున్నారు. 2019 మార్చి 15న వివేకా హత్య జరిగిప్పటి నుంచి విపక్షాలు.. అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపైనే విమర్శలు గుప్పిస్తున్నాయి. 2020 మార్చి 11న హైకోర్టు ఆదేశాలతో దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ.. అప్పటి నుంచి అవినాష్రెడ్డిని ఇంతవరకు విచారించలేదు. కానీ.. కోర్టుకు సమర్పించిన ఛార్జ్షీట్లో అవినాష్పై పలు అనుమానాలు లేవనెత్తింది.
అవినాష్రెడ్డి, తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్రెడ్డి ద్వారా వివేకాను హత్యచేశారనే సందేహాలున్నాయని సీబీఐ పేర్కొంది. కడప లోక్సభ టికెట్ అవినాష్రెడ్డికి కాకుండా, షర్మిల, విజయమ్మలకు, లేకపోతే తనకు ఇవ్వాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని.. ఈ నేపథ్యంలో అవినాష్రెడ్డే వివేకాను హత్య చేయించి ఉంటారని సీబీఐ భావిస్తోంది. ఇక వివేకా హత్యకు సుపారీ ఇచ్చారని ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి వాంగ్మూలాన్నీ సీబీఐ నమోదు చేసింది. ఇందులో అవినాష్రెడ్డి, భాస్కర్రెడ్డి, మనోహర్రెడ్డి, డి.శివశంకర్రెడ్డి వంటి పెద్దవాళ్లున్నారని వివేకా సన్నిహితుడైన ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారంటూ దస్తగిరి సీబీఐ విచారణలో వెల్లండించారు.