AP Govt On Loans: కడప జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన మహిళా బాధితులకు సంబంధించి రుణాలను మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కడప జిల్లా రాజంపేట మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన బాధిత మహిళల ఎస్హెచ్జీ రుణాలు, స్త్రీ నిధి, ఉన్నతి పథకాల్లోని రుణాలను మాఫీ చేయాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తంగా రూ.8.98 కోట్ల రుణాల్ని మాఫీ చేసేందుకుగానూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ స్వయం సహాయక బృందాల రుణాలు, స్త్రీనిధి, ఉన్నతి పథకాల రుణాలను మాఫీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
రాజంపేట మండలంలోని గుండ్లూరు, మందపల్లి, పులపుత్తూరు, ఆర్.బుడుగుంటపల్లి, శేషాంబపురం, తాళ్లపాక రెవెన్యూ గ్రామాలకు చెందిన వారికి ఈ మాఫీ వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ గ్రామీణ బ్యాంక్, కెనరా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల్లో వివిధ పథకాల కింద ఉన్న మహిళల రుణాలను మాఫీ చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.