ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మాండవ్య నదిలో కొట్టుకుపోయిన కారు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరు సురక్షితం

By

Published : Nov 27, 2020, 9:08 PM IST

నివర్ తుపాన్ ప్రభావంతో ఎక్కడిక్కడే వాగులు,వంకలు పొర్లి పారుతున్నాయి. పలు చోట్ల వరద నీరు రహదారులపైకి చేరటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణిస్తున్న వాహనాలు సైతం నీటిలో కొట్టుకుపోతున్నాయి. చిత్తూరు జిల్లా నుంచి కడప జిల్లాకు నలుగురు కారులో వస్తూ గొల్లపల్లి వద్ద మాండవ్య నది నుంచి వస్తున్న వరద ఉద్దృతికి నీటిలో కొట్టుకుపోయింది. ఇందులో ఇద్దరు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరు చనిపోయారు.

మాండవ్య నదిలో కొట్టుకుపోయిన కారు..ఇద్దరు మృతి
మాండవ్య నదిలో కొట్టుకుపోయిన కారు..ఇద్దరు మృతి

కడప చిత్తూరు జిల్లాల సరిహద్దులోని గుర్రంకొండ మండలం గొల్లపల్లి వద్ద మాండవ్య నది నీటి ఉద్ధృతికి ఓ కారు కొట్టుకుపోయింది. చిత్తూరు జిల్లా కలిచర్ల నుంచి రాజంపేటకు వస్తున్న కారు గొల్లపల్లి వద్ద బ్రిడ్జిని దాటేందుకు ప్రయత్నిస్తుండగా నీటి వేగానికి నదిలో కొట్టుకు పోయింది. ఈ విషయాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాయచోటి డీఎస్​పీ వాసుదేవన్, సీఐ లింగప్ప చిత్తూరు జిల్లాలోని గుర్రంకొండ పోలీసులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. నీటిలోని కారును జేసీబీ యంత్రాల ద్వారా వెలికి తీయించారు. కారులో ప్రయాణించిన నలుగురు వ్యక్తులలో అనములగుండెము నాగరాజు, వెంకటసుబ్బయ్యలు క్షేమంగా బయటపడ్డారు. వడేళ్లగారి రవి, అరిటాకుల వెంకటసుబ్బయ్య కారులో చిక్కుకొని మృతి చెందారని పోలీసులు తెలిపారు. వీరంతా కడప జిల్లా రాజంపేట పట్టణం మన్నూరు చెందిన వారుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details