పచ్చని కుటుంబాన్ని ప్రాణాంతక వ్యాధి ఛిన్నాభిన్నం చేసింది. కడప జిల్లా చెన్నూరు మండలం చెన్నూరు శివాలయం వీధికి చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అరుదుగా సోకే మస్క్యులర్ డెస్ట్రొఫీ బారిన పడ్డారు. తల్లి పద్మావతి 30 ఏళ్ల క్రితమే ఈ వ్యాధికి గురై మంచానికే పరిమితమయ్యారు. ఉన్నత చదువులు చదివిన కుమారుడు, కుమార్తె చక్కని ఉద్యోగాల్లో స్థిరపడేలోపే వారిలోనూ కండరాల వ్యాధి బయటపడింది.
ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ ఉద్యోగం ఖాయం కానున్న తరుణంలో కుమార్తెకు సోకిన ఈ వ్యాధి ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. ప్రైవేటు ఉద్యోగిగా స్థిరపడిన ఆమె సోదరుడు సైతం కొన్ని రోజుల్లో ఇదే రీతిలో అశక్తుడుగా మారిపోయాడు. 10 ఏళ్లుగా ఈ వ్యాధితో పోరాడుతున్న వారు... చూస్తుండగానే ఎవరైనా సాయం ఉంటే తప్ప మనుగడ సాగించలేని స్థితికి చేరుకున్నారు.