ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 31, 2020, 5:59 PM IST

Updated : Dec 31, 2020, 7:28 PM IST

ETV Bharat / state

అసలు దోషులపై 15 రోజుల్లో కేసులు నమోదు చేయాలి: లోకేశ్

ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురైన తెదేపా నాయకుడు నందం సుబ్బయ్య అంత్యక్రియలు ప్రొద్దుటూరులో ముగిశాయి. సుబ్యయ్య అంతిమయాత్రలో నారా లోకేశ్‌ సహా..ఆ పార్టీ నేతలు పాల్గొన్నారు. సుబ్బయ్య హత్యతో తనకెలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధ తెలిపారు. ఈ కేసులో బాధిత కుటుంబ సభ్యులు తన పేరును అనవసరంగా తెరపైకి తీసుకువచ్చారన్నారు. కేసులో ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు స్పష్టం చేశారు.

అసలు దోషులపై 15 రోజుల్లో కేసులు నమోదు చేయాలి
అసలు దోషులపై 15 రోజుల్లో కేసులు నమోదు చేయాలి

కడప జిల్లా ప్రొద్దుటూరులో సోమవారం హత్యకు గురైన తెలుగుదేశం నాయకుడు నందం సుబ్బయ్య అంత్యక్రియలు ముగిశాయి. ఉదయం సుబ్బయ్య ఇంటికి చేరుకున్న నారా లోకేశ్‌...కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంత్యక్రియల్లో పాల్గొని..బాధిత కుటుంబానికి తెదేపా పార్టీ తరఫున 20 లక్షలు, కడప జిల్లా తెదేపా నేతలిచ్చిన 14 లక్షలతో కలిపి మెుత్తం 34 లక్షలు సాయం ప్రకటించారు. పిల్లల చదువు బాధ్యతను తీసుకుంటానని లోకేశ్ భరోసానిచ్చారు. నిందితులపై 15 రోజుల్లోగా కేసు నమోదు చేయాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని శిక్షించే వరకు వదిలిపెట్టేది లేదని లోకేశ్ స్పష్టం చేశారు.

లోకేశ్ ఆందోళన

సుబ్బయ్య హత్య ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే ప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగార్రెడ్డి, పురపాలక కమిషనర్ రాధ పేర్లు చేర్చాలంటూ లోకేశ్ మెరుపు నిరసనకు దిగారు. మృతదేహం వద్దే బైఠాయించి ఆందోళన చేశారు. దాదాపు 3 గంటలకుపైగా ఆందోళన చేసిన లోకేశ్‌తో పోలీసులు చర్చలు జరిపి.. సుబ్బయ్య భార్య స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. కోర్టు ద్వారా వాళ్ల ముగ్గురి పేర్లను నిందితుల జాబితాలో చేర్చేందుకు పోలీసులు అంగీకరించారు.

తెదేపా నేతల నిరసనలు

హత్యకు గురైన నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా నిలిచేందుకు చేనేతలంతా ఏకం కావాలని తెదేపా బీసీ నాయకులు పిలుపునిచ్చారు. సుబ్బయ్య కుటుంబానికి న్యాయం చేయాలంటూ నేతలు పలు జిల్లాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ అనంతపురంలో అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు హిమని సెంటర్​లోని గాంధీ విగ్రహం వద్ద నల్ల జెండాలు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాయకులు నినాదాలు చేశారు. ఫ్యాక్షన్ రాజకీయాలను వైకాపా పెద్దలు పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు.

'హత్యతో నాకేం సంబంధం'

నందం సుబ్బయ్య హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధ తెలిపారు. ఈ కేసులో బాధిత కుటుంబ సభ్యులు తన పేరును అనవసరంగా తెరపైకి తీసుకువచ్చారని ఆమె చెప్పారు. కావాలనే సుబ్బయ్య కుటుంబం నాపేరు ప్రస్తావిస్తోందన్నారు. హత్య జరిగిన సమయానికి హోమంలో ఉన్నానని.. ఘటనాస్థలికి సుబ్బయ్య వస్తే కాసేపు ఉండమని మాత్రమే చెప్పాన్నారు. ఆయనను ఎవరు చంపారో చూడలేదని.. దయచేసి రాజకీయాల్లోకి అధికారులను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి విచారణను ఎదుర్కొవాటినికైనా సిద్ధమని ఆమె తెలిపారు.

'పాత కక్షలతోనే సుబ్బయ్య హత్య'

తెలుగుదేశం నేత సుబ్బయ్య హత్యతో స్థానిక ఎమ్మెల్యే రామమల్లు శివప్రసాద్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని వైకాపా నేత ఆకేపాటి అమర్నాథరెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయం స్థానిక తెలుగుదేశం నేతలకీ తెలుసని.. పాతకక్షలతో సుబ్బయ్య హత్య జరిగి ఉంటుందన్నారు.

పోలీసుల అదుపులో నిందితులు

సుబ్బయ్య హత్య కేసుకు సంబంధించి ఐదుగురుని అదుపులోకి తీసుకున్నామని కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు. మృతుడికి గతంలో ఏ1, ఏ2లకు మనస్పర్ధలు ఉండేవని తెలిపారు. కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపడతామని దోషులు ఎవరైనా సరే తప్పించుకోలేరని ఎస్పీ స్పష్టం చేశారు.

అసలు దోషులపై 15 రోజుల్లో కేసులు నమోదు చేయాలి

ఇదీచదవండి

సుబ్బయ్య కుటుంబానికి తెదేపా సాయం రూ. 20 లక్షలు

Last Updated : Dec 31, 2020, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details