ఏమిటీ పరిశోధన..?
ఫ్రాన్స్లోని ఎయిక్స్-మార్సిల్లె యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు రెమి ఛారెల్, బోరిస్ పాస్టోరినో ఈ పరిశోధనను నిర్వహించారు. 197.6 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతలో, 212 డిగ్రీల ఫారెన్హీట్ వేడి నీటిలో కరోనా వైరస్ను 15 నిమిషాల పాటు ఉంచినప్పుడు మాత్రమే అది చనిపోయినట్లు తేల్చారు. దీన్ని బట్టి 92 డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిమిలో 15 నిమిషాల పాటు, 56 డిగ్రీల సెంటిగ్రేడ్లో దాదాపు గంటసేపు కరోనా వైరస్ను ఉంచినప్పుడే దానిని చంపగలమని వారు వెల్లడించారు.
ఫలితాల్లో తేడాలు...
ఈ నెల మొదట్లో హాంకాంగ్ యూనివర్సిటీ జరిపిన పరిశోధనలో 132 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలో 30 నిమిషాల పాటు కరోనా వైరస్ జీవించే ఉందని తేలింది. ఉష్ణోగ్రతను 158 డిగ్రీలకు పెంచినప్పుడు 5 నిమిషాల్లోనే అది చనిపోయిందని గుర్తించారు. ఈ ఫలితాలకు ఎయిక్స్-మార్సిల్లె యూనివర్సిటీ పరిశోధన తేల్చిన అంశాలకు మధ్య ఎంతో తేడా ఉండటం గమనార్హం. ప్రయోగశాలల్లో భారీ ఉష్ణోగ్రతలను కృత్రిమంగా సృష్టించి, నియంత్రిత పరిస్థితుల్లో చేసే అధ్యయనాల ఫలితాల్లో తేడాలు ఉండటం సహజమని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రయోగశాలల్లో కృత్రిమ వేడిమిని సృష్టించి చేసే పరిశోధనలకు, వాస్తవ ప్రపంచ వాతావరణ పరిస్థితులకు ముడిపెట్టడంలో ఔచిత్యం లేకపోవచ్చునని, ఇప్పటిదాకా మనం చూసిన కరోనా వైరస్లు తక్కువ తీవ్రత కలిగినవి కాబట్టి ఉష్ణోగ్రతలకు ప్రభావితమయ్యేమని, ప్రస్తుతం విజృంభిస్తున్న కొత్త కరోనాను వేడిమి ఏమీ చేయజాలదని డాక్టర్ హార్వే ఫిన్బెర్గ్ అనే శాస్త్రవేత్త స్పష్టం చేశారు. శ్వాసక్రియ ద్వారా ఊపిరితిత్తుల్లోకి బిందువులు ప్రయాణించే తీరు గాలిలోని ఆర్ద్రత వల్ల మార్పులకు లోనవుతుందని, తద్వారా వైరస్ వ్యాప్తి తగ్గే అవకాశం ఉంటుంది కానీ ఇది చాలా నామమాత్రమని కొందరు శాస్త్రవేత్తలు చెప్పారు.
యూవీ... భరోసా..!
బహిరంగ ప్రదేశాల్లో కంటే... గృహాలు, భవనాల లోపల కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, సూర్యకాంతిలో వైరస్ త్వరగా చనిపోవడమే అందుకు కారణమని అమెరికాలోని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) తన అధ్యయనంలో తేల్చింది. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదని కొందరు శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ప్రయోగశాలలను వైరస్ రహితంగా మార్చేందుకు దాని జన్యువులను చంపేందుకు అతినీల లోహిత కిరణాల(అల్ట్రా వయొలెట్-యూవీ) కాంతిని ఆయుధంగా వాడుతుంటాన్ని వారు గుర్తుచేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ముఖ్యంగా అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా పడేచోట్ల వైరస్ను నిలువరించడం సులభతరమని చెబుతున్నారు.