patient parents need help in Kadapa: కడప జిల్లా ప్రొద్దుటూరు హనుమాన్ నగర్కు చెందిన సులోచన, రామకృష్ణ దంపతులు మగ్గం నేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణ డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగ యత్నాల్లో ఉన్నాడు. రెండో కుమారుడు శేఖర్ ఓ మెడికల్ షాపులో పనిచేస్తున్నాడు. లక్ష్మీనారాయణ మూడు వారాల క్రితం మిత్రుడితో కలిసి తిరుపతి వెళ్తూ.. ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడటంతో మొదట కడపలో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి తీవ్రంగా ఉందని చెప్పడంతో హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొన్ని వారాలుగా కోమాలోనే ఉన్న కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు. కోమాలో ఉన్న తమ కుమారుడికి దాతలు సాయం చేసి.. ప్రాణం పోయాలని వేడుకుంటున్నారు.
వైద్యులు రూ.20 లక్షలు అవసరమన్నారు..
వైద్యం కోసం రోజుకు రూ.30 వేల వరకూ ఖర్చువుతోందని లక్ష్మీనారాయణ తల్లిదండ్రులు తెలిపారు. బంధువుల వద్ద అప్పులు తెచ్చి ఇప్పటికే రూ. 8 లక్షలు ఖర్చు పెట్టామని తెలిపారు. వైద్యులు రూ. 20 లక్షల వరకూ అవసరమని చెప్పడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఉందని వాపోయారు. దాతలెవరైనా ఆదుకుని తమ కుమారుడిని బతికించాలని వేడుకుంటున్నారు.