ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రసవత్తరంగా స్థానిక ఎన్నికలు.. కీలక ప్రాంతాలపై అగ్ర నేతలప్రత్యేక దృష్టి

స్థానిక ఎన్నికల్లో..పెద్ద పంచాయతీలపై నాయకులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పట్టు సాధించేందుకు జోరుగా చర్చలు సాగుతున్నాయి.

By

Published : Feb 1, 2021, 1:41 PM IST

Published : Feb 1, 2021, 1:41 PM IST

kadapa panchayati elections
రసవత్తరంగా స్థానిక ఎన్నికలు

కడప జిల్లాలోని గ్రామాల్లో ఎన్నికల వేడి క్రమంగా రాజుకుంటోంది. తమ పంచాయతీ సర్పంచి పదవి ఎవరిని వరిస్తుందన్న విషయంపై గ్రామ రచ్చబండలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. జిల్లాలో జనాభా, ఆదాయం పరంగా మెరుగైన స్థితిలో ఉన్న 8 మేజర్‌ పంచాయతీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. వీటిని ఎలాగైనా తమ మద్దతుదారులతో కైవసం చేసుకోవాలని ప్రధాన పార్టీల నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. చాలా వాటిల్లో సర్పంచి స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు అయి ఉన్నాయి. దీంతో కనీసం ఉప సర్పంచి పదవి అయినా దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఫలితంగా పోటీ రసవత్తరంగా మారింది. ప్రధాన పంచాయతీల్లో రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే..!

పంచాయతీ : రైల్వేకోడూరు

*మండలం : రైల్వేకోడూరు, జనాభా : 32,725

*మొత్తం ఓటర్లు : 20,058 పురుషులు : 9960, మహిళలు : 10,095 ఇతరులు : 3

*వార్షిక ఆదాయం : రూ.1.05 కోట్లు

*జనాభా : 16,201

సమన్వయలోపం

మూడో దశలో ఎన్నికలు జరగనున్న ఈ పంచాయతీ సర్పంచి స్థానాన్ని ఎస్టీ మహిళకు రిజర్వు చేశారు. వైకాపా స్థానిక నాయకుడు ధ్వజారెడ్డి రామిరెడ్డి అభ్యర్థి ఎంపికలో కీలకపాత్ర పోషిస్తున్నారు. తెదేపా రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాదు, నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాథనాయుడు ఆధ్వర్యంలో అభ్యర్థి ఎంపికపై చర్చలు జరుగుతున్నాయి. వీళ్లద్దరి మధ్య సమన్వయం సరిగా లేదని ప్రచారం జరుగుతోంది. జనసేన- భాజపా తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపనున్నారు.

జిల్లాలో మేజర్‌ పంచాయతీలు

రైల్వేకోడూరు, నాగిరెడ్డిపల్లె, పోరుమామిళ్ల, చెన్నూరు, ఖాజీపేట, ముద్దనూరు, వేంపల్లె, సింహాద్రిపురం

పంచాయతీ : చెన్నూరు

*మండలం : చెన్నూరు,

*మొత్తం ఓటర్లు : 13,403 పురుషులు : 6,473

*మహిళలు : 6,928 ఇతరులు : 2

*వార్షిక ఆదాయం : రూ.25 లక్షలు

ఎంపికపై మల్లగుల్లాలు

చెన్నూరు పంచాయతీకి రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఉప సర్పంచి పదవి కోసం పలువురు ఓసీ అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇక్కడ వైకాపా, తెదేపా మద్దుతుదారుల మధ్య పోటీ నడుస్తోంది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి వైకాపా మద్దతు సర్పంచి అభ్యర్థిని ఎంపిక చేస్తారు. స్థానిక ప్రముఖ నాయకుడు బలపరుస్తున్న వ్యక్తి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తెదేపా మండల అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డి సర్పంచి స్థానానికి పలువురి పేర్లను ప్రతిపాదించారు. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి అందులో ఒకరిని ఎంపిక చేయాల్సి ఉంది.

పంచాయతీ : సింహాద్రిపురం

*మండలం : సింహాద్రిపురం

*జనాభా : 3726, ఓటర్లు : 5565

*పురుషులు: 2711, మహిళలు : 2854

*వార్షిక ఆదాయం : రూ.4,82,820

పోటికి సై

ఇక్కడ నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవిని ఏకగ్రీవం చేయటానికి స్థానిక నాయకులు యత్నిస్తున్నారు. ఎమ్మెల్సీ బీటెక్‌ రవి సొంత మండలం సింహాద్రిపురం అవడంతో ఇక్కడ తెదేపా మద్దతుదారుడిని పోటీలో నిలపాలని భావిస్తున్నారు.

పంచాయతీ : వేంపల్లె

*మండలం : వేంపల్లె

*జనాభా : 36,031

*ఓటర్లు : 29,382 పురుషులు : 14,432 మహిళలు : 14,947 ఇతరులు : 3

అభ్యర్థి కరవు

ఇక్కడ నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోవడానికి వైకాపా పావులు కదుపుతోంది. ఇంకా అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. 2013లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తెదేపా మద్దతుదారుడిగా సతీష్‌రెడ్డి తమ్ముడు విష్ణువర్ధన్‌రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. సతీష్‌రెడ్డి తెదేపాను వీడడంతో ఇక్కడ ఎవరూ పోటీలో నిలిచే అవకాశం లేదని తెలుస్తోంది.

పంచాయతీ : పోరుమామిళ్ల

*మండలం : పోరుమామిళ్ల,

*మొత్తం ఓటర్లు : 13,339 పురుషులు : 6,708

*మహిళలు : 6,629 ఇతరులు : 2

*వార్షిక ఆదాయం : రూ.55 లక్షలు

పోరు తప్పదు

ఇక్కడ తొలి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైకాపా మద్దతుతో జడ్పీటీసీ మాజీ సభ్యుడు నాగార్జునరెడ్డి సతీమణి సురేఖ పోటీలో ఉన్నారు. వీళ్ల కుటుంబసభ్యులు రాజకీయాల్లో ఉన్నారు. తెదేపా మద్దతుదారుడిగా సినీ నిర్మాత యనమల సుధాకర్‌ బరిలో నిలవడానికి సిద్ధమయ్యారు. మాజీ ఎమ్మెల్యే జయరాములు ప్రస్తుతం భాజపాలో ఉన్నారు. ఇక్కడ జనసేన- భాజపా మద్దతుదారుడు బరిలో నిలవనున్నారు.

పంచాయతీ : ముద్దనూరు

*మండలం : ముద్దనూరు

*జనాభా : 9,775, ఓటర్లు : 7,954

*వార్షిక ఆదాయం : రూ.54 లక్షలు

వర్గపోరు

ఇక్కడ నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. వైకాపాలో వర్గపోరు కనిపిస్తోంది. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితోపాటు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు పోటీకి సిద్ధమవుతున్నారు. ముద్దనూరు మండలం పరిధిలో గతేడాది వివిధ ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేసిన భాజపా.. ప్రస్తుతం కూడా మద్దతుదారుడిని పోటీలో నిలపనుంది.

పంచాయతీ : నాగిరెడ్డిపల్లె

*మండలం : నందలూరు

*జనాభా : 12,318

*మొత్తం ఓటర్లు : 9,026 పురుషులు : 4,356 మహిళలు : 4,667 ఇతరులు : 3

*వార్షిక ఆదాయం : రూ.57.92 లక్షలు

దీటైన అభ్యర్థులు

మండల కేంద్రం నందలూరు అయినా నాగిరెడ్డిపల్లె పంచాయతీ పరిధిలోనే రైల్వేస్టేషన్‌, కోర్టు ఉన్నాయి. ఇక్కడ మూడో దశలో ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి స్థానాన్ని ఎస్సీ మహిళకు రిజర్వు చేశారు. వైకాపాలో వర్గ పోరు కనిపిస్తోంది. ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి వర్గీయులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. తెదేపా మండల అధ్యక్షుడు సమ్మేట శివప్రసాద్‌ ఆధ్వర్యంలో అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇక్కడ దీటైన అభ్యర్థులు రంగంలో నిలిచే అవకాశం కనిపిస్తోంది.

పంచాయతీ : ఖాజీపేట..

*మండలం : ఖాజీపేట

*జనాభా : 11,658

*ఓటర్లు : 10,504, పురుషులు : 5285 మహిళలు : 5217 ఇతరులు : 2

జోరుగా చర్చలు: తొలి దశలో ఎన్నికలు జరుగుతున్న ఖాజీపేట సర్పంచి స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు రిజర్వు చేశారు. మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ప్రస్తుతం వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని స్థానికంగా భావిస్తున్నారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. ఈ నేపథ్యంలో డీఎల్‌ వర్గీయులు స్వతంత్రంగా పోటీ చేయాలని భావిస్తున్నారు. ఫలితంగా తెదేపా మద్దతుదారులకు కొన్నిచోట్ల మేలు జరిగే అవకాశం ఉంది. తెదేపా నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ అభ్యర్థి ఎంపికపై స్థానిక కార్యకర్తలతో సమాలోచనలు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

పులివెందుల ఆర్టీసీ డిపో ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్టీసీ ఎండీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details