ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరులో సైకిల్ పొద్దు పొడిచేనా?

కడప జిల్లాలో ప్రొద్దుటూరు తెదేపా రాజకీయం... ఆసక్తికరంగా మారింది. టికెట్ ఆశించి భంగపడిన సీనియర్ నాయకుడు వరదరాజులురెడ్డి.. చివరికి శిష్యుడిని గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వేరు కుంపటి పెడతారని అంతా అనుకున్నా.. అధినేత చంద్రబాబు సూచన మేరకు శిష్యుడు లింగారెడ్డి విజయానికి శ్రమిస్తున్నారు.

By

Published : Mar 27, 2019, 12:02 PM IST

పొద్దుటూరులో ఒక్కటైన గురుశిశ్యులు

పొద్దుటూరులో ఒక్కటైన గురుశిశ్యులు
ఒక్కటైన గురుశిశ్యులు

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో అధికార‌, ప్ర‌తిప‌క్షాల‌కు.. ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమయ్యాయి. ప‌ట్టు నిలుపుకోవాల‌ని వైకాపా ప్ర‌య‌త్నిస్తుంటే... పాగా వేసేందుకు తెలుగుదేశం ఉవ్విళ్లూరుతోంది. ఈ సారి ఎలాగైనా పసుపు జెండా ఎగరేయాలని భావిస్తున్న తెదేపా... తమ అభ్యర్థిగా లింగారెడ్డిని నిలబెట్టింది.2009లో ప్రొద్దుటూరు నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన లింగారెడ్డి జయకేతనం ఎగురవేశారు. ఆ సమయంలో జిల్లాలోని మిగ‌తా తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్ జెండా రెప‌రెప‌లాడింది. 2014 ఎన్నికల నాటికి.. కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు, 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం ఉన్న వరదరాజులురెడ్డి... తెదేపా గూటికి చేరారు. అప్పుడు లింగారెడ్డిని కాదని.. వరదరాజులును తెదేపా పోటీకి దించింది. వైకాపా జోరుతో ఆయన ఓడిపోయారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలని భావించిన తెదేపా అధినేత చంద్రబాబు.. మరోసారి లింగారెడ్డిపై విశ్వాసం ఉంచారు. తనకే అవకాశం ఖాయమని నమ్మకంతో ఉన్న వరదరాజులు రెడ్డి... చంద్రబాబు నిర్ణయంతో కంగుతిన్నారు. లింగారెడ్డికి అవకాశం రావడంపై అలకబూనారు. ఆయన పార్టీ మారతారని చాలామంది అనుకున్నారు. అయినా... భవిష్యత్తులో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామన్న అధినేత హామీతో మెట్టు దిగారు. శిష్యుడు లింగారెడ్డి విజయానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

ఫలించిన ఆదినారాయణ రెడ్డి మధ్యవర్తిత్వం

వ‌ర‌ద‌రాజుల‌ రెడ్డి విష‌యంలో కడప పార్లమెంటు అభ్యర్థి, ఆదినారాయ‌ణ‌ రెడ్డి ప్ర‌త్యేక చొవ‌ర చూపారు. ఈ నెల 24న జిల్లా ప‌ర్య‌టన‌కు వ‌చ్చిన అధినేత చంద్రబాబుతో వ‌ర‌ద‌రాజుల‌రెడ్డి సమావేమయ్యారు. లింగారెడ్డి గెలుపు కోసం సహరించాలని సూచిస్తూ... ఎమ్మెల్సీ ఇస్తామని రాయచోటి సభలో చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు. ఈ పరిణామమే.. వరదరాజుల రెడ్డిని శాంతింపజేసింది. ఆ వెంటనే సమావేశం ఏర్పాట చేసిన ఆయన... లింగారెడ్డి విజయానికి తమ క్యాడర్ పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు. అగ్నికి వాయువు తోడైన‌ట్లు.. గురుశిష్యులిద్దరూ ఒక్కటవడం.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రెట్టింపు చేసింది.

ఇన్నాళ్లు ఎడమొహం, పెడమొహంగా ఉన్న లింగారెడ్డి, వరదరాజుల రెడ్డి ఒక్కటవడం.. ప్రొద్దుటూరులో తెలుగుదేశం శ్రేణులను ఉత్సాహంగా ముందుకు కదిలేలా చేసింది. విజయం తమదేనన్న విశ్వాసం తెలుగుతమ్ముళ్లలో బలంగా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇవీ చూడండి:జయదేవుడా..? గోపాలుడా..? శ్రీనివాసుడా..?

ABOUT THE AUTHOR

...view details