పర్యావరణ పరిరక్షణలో కీలకమైనది పచ్చదనమే. పచ్చదనం పెంపునకు ప్రభుత్వాలు వేల కోట్లు వ్యయం చేస్తున్నా ఆశించిన ఫలితం కనిపించటం లేదు. కడప జిల్లాలో ప్రతి వర్షాకాలంలోనూ లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతున్నట్లు యంత్రాంగం చెబుతోంది. ఇందులో సంరక్షణ శాతంపై అనేక మంది సందేహం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటడం, సంరక్షించే బాధ్యతను గతంలో వెలుగు మహిళలకు అప్పగించారు. ప్రస్తుతం ఈ బాధ్యతను ఉపాధి కూలీలకు అప్పగిస్తున్నారు. ఇలా తరచుగా బాధ్యతలు మార్చుతుండటం వల్ల పచ్చదనం పెంపుదలకు అడ్డంకులు ఎదురవుతాయని భావిస్తున్నారు.
● రాష్ట్రంలో కొలువుదీరిన నూతన ప్రభుత్వం 2020-2021 సంవత్సరానికి సంబంధించి జిల్లాలో పంచాయతీకి 2 కి.మీ. చొప్పున మొత్తం 812 పంచాయతీల్లో 1570 కి.మీటర్ల పరిధిలో మొక్కలు నాటి సంరక్షించాలని నిర్దేశించింది. ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యంలో భాగంగా జూన్ చివరి నాటికి సుమారు 987 కిలోమీటర్లను గుర్తించారు. ఈ మేరకు అనుమతులకు సిద్ధం చేశారు. మొత్తంగా కిలోమీటరుకు 400 చొప్పున 6,28,000 మొక్కలు నాటనున్నారు.
● మొక్కల సంరక్షణ బాధ్యతను స్థానిక ఉపాధి కూలీలకు అప్పగించనున్నారు. ఒక్కొక్క కూలీ సగటున 100 మొక్కల సంరక్షణ చేపట్టాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆ కూలీకి 100 పని దినాలను కల్పించి వేతనం ఇవ్వనున్నారు.
● జిల్లావ్యాప్తంగా జులై 7వతేదీ నాటికి 1570 కి.మీటర్లలో మొక్కలు నాటేందుకు సంబంధించిన అనుమతులు ఇవ్వనున్నారు. అనుమతులు పొందిన పంచాయతీల్లో జులై 25వ తేదీ నాటికి మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను స్థానిక ఉపాధి కూలీలకు అప్పగిస్తారు.
శాఖల మార్పుతో ..
గతంలో కూడా ఉపాధి పథకం కింద మొక్కలు నాటి, సంరక్షించేవారు. 2017-2018లో అప్పటి ప్రభుత్వం మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతలను పొదుపు మహిళలకు అప్పగించింది. ప్రస్తుతం మళ్లీ ఉపాధి శాఖకు మార్చారు.
● 2017-2018లో జిల్లాలోని 175 పంచాయతీల్లో 718 కి.మీటర్ల పరిధిలో లక్షల సంఖ్యలో మొక్కలు నాటారు. వాటి సంరక్షణ బాధ్యతను అప్పట్లో వెలుగు ఆధ్వర్యంలోని పొదుపు మహిళలకు అప్పగించారు. దీనికి సంబంధించి మొక్కకు 50 పైసల చొప్పున చెల్లించారు.