కడప రిమ్స్లో ఇవాళ్టి నుంచి కేవలం అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందించాలని వైద్యాధికారులు నిర్ణయించారు. ఈ నెలాఖరు వరకు ఓపీ సేవలు బంద్ చేయాలని తీర్మానించారు. కరోనా అనుమానంతో రిమ్స్ ఐసోలేషన్ వార్డులో చేరిన నలుగురికి నెగిటివ్ రాగా... మరో ముగ్గురి నివేదికలు రావాల్సి ఉంది. ఇప్పటికే సౌదీ, కువైట్ నుంచి వచ్చిన దాదాపు 2 వేల మందిని గుర్తించి వారికి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
కరోనా వైరస్ ప్రభావంతో ఈనెల 22న దేశవ్యాప్తంగా ప్రజలంతా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇళ్లకే పరిమితం కావాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో జన సమూహాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. ప్రధానంగా కడప జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)కి రోజుకు వెయ్యి నుంచి 2 వేల మంది వరకు ఔట్ పేషెంట్లు, మరో వెయ్యి మంది ఇన్ పేషెంట్లు వస్తుంటారు. కానీ కరోనా వైరస్ కారణంగా ఆసుపత్రికి వచ్చే రోగులను గణనీయంగా తగ్గించాలనే డీఎంఈ ఆదేశాలతో ఇవాళ్టి నుంచి రిమ్స్లో సాధారణ వైద్య సేవలు నిలిపివేశారు. కేవలం అత్యవసర వైద్య సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ గిరిధర్ తెలిపారు.