ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్యావరణ అనుమతులు లేకుండానే మైనింగ్ - పర్యావరణ అనుమతులు లేకుండానే మైనింగ్

కడప జిల్లా కొండ గంగమ్మ తల్లి మైన్స్‌ పేలుడు ఘటనకు ఉల్లంఘనలే కారణమని అధికారులు తేల్చారు. పర్యావరణ అనుమతులు లేకుండానే యాజమాన్యం మైనింగ్‌ చేసినట్లు తేల్చారు. తవ్వకాల నిలుపుదలకూ గతంలోనే ఆదేశాలిచ్చినా...వాటిని బేఖాతరు చేశారని ప్రభుత్వానికి కలెక్టర్‌ నివేదిక సమర్పించారు.

Mining without environmental permits at kadapa
పర్యావరణ అనుమతులు లేకుండానే మైనింగ్

By

Published : May 10, 2021, 4:44 AM IST

కడప జిల్లా కలసపాడు మండలం కొండ గంగమ్మ తల్లి మైన్స్‌లో శనివారం జిలిటెన్‌ స్టిక్స్‌ పేలి 10 నిండు ప్రాణాలు పోయాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులకు విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి తెచ్చారు. మామిళ్లపల్లెలో 30.696 హెక్టార్లలో మైనింగ్‌ నిర్వహించేందుకు ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య భార్య కస్తూరిభాయికి ప్రభుత్వం అనుమతిచ్చింది. ఆయన పదేళ్లపాటు మైనింగ్‌ చేసుకునేందుకు బ్రహ్మంగారిమఠం మండలం చెంచయ్యగారిపల్లికి చెందిన చిలకంపల్లి నాగేశ్వరరెడ్డికి జీపీఏ కట్టబెట్టారు. ఈ లీజు అనుమతులు ఈ ఏడాది నవంబరు 1 వరకు ఉన్నాయి. 2019 అక్టోబరు 16, 18 తేదీల్లో అసిస్టెంట్‌ జియాలజిస్ట్‌ గనుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు..లోపాలను గుర్తించారు. వాటిని వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. 2020 ఆగస్టు 25న అధికారుల బృందం మరోసారి అక్కడ తనిఖీలు జరిపి..అంతకు ముందు గుర్తించిన లోపాలేవీ సరిచేయలేదని తేల్చింది. దీంతో గనుల శాఖాధికారులు లీజుదారైన కస్తూరిబాయికి షోకాజ్‌ నోటీసులిచ్చారు. క్వారీ లీజు రద్దు ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపించారు. అక్రమ తవ్వకాలు, రవాణా వంటివేవీ జరగకుండా చూడాలని కలసపాడు తహసీల్దార్‌, ఎస్సైకు సూచించారు. వారు కొవిడ్‌ నియంత్రణ విధుల్లో ఉండడం వల్ల.. నాగేశ్వరరెడ్డి మైనింగ్‌ కార్యకలాపాల కోసం వేముల నుంచి పేలుడు పదార్థాలు తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు.

ప్రభుత్వానికి నివేదిక

గనిలో పేలుడుకు దారితీసిన పరిణామాలపై కడప జిల్లా కలెక్టర్‌ హరికిరణ్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అందులో మైనింగ్‌ కార్యకలాపాల నిర్వహణపై సస్పెన్షన్‌ ఉన్నప్పటికీ..దాని జీపీఏ హోల్డరైన చిలకంపల్లె నాగేశ్వరరెడ్డి అక్రమంగా కార్యకలాపాలు నిర్వహించారని వివరించారు. ఖనిజం వెలికితీసేందుకు పేలుడు పదార్థాలు వినియోగించి ఎక్స్‌ప్లోజివ్స్‌ నియమావళి-2008నీ ఉల్లంఘించారని పేర్కొన్నారు. అధికారులు కొవిడ్‌ నియంత్రణ విధుల్లో ఉండటం, వరుసగా 2 రోజులు సెలవు దినాలు కావడంతో...గని వైపు అధికారులెవరూ రారని భావించి.. వేంపల్లె ప్రాంతం నుంచి పేలుడు పదార్థాలను తీసుకొచ్చారని ప్రస్తావించారు. వాటిని దించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం, నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్లే పేలుడు సంభవించి 10 మంది చనిపోయారని వివరించారు. మృతుల కుటుంబాలకు కనీసం 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాలని నివేదికలో కోరారు.

ఇదీచదవండి

కడప పేలుడు ఘటన: గని యజమానిపై కేసు నమోదు

ABOUT THE AUTHOR

...view details