మార్షల్ ఆర్ట్స్ మాస్టర్...ఈ విద్యార్థులకు మెగాస్టార్ తైక్వాండో, కర్రసాము, కత్తిసాములో విద్యార్థులకు శిక్షణ ఇస్తూ, వారి నైపుణ్యానికి మెరుగులు దిద్దుతున్నారు కడపకు చెందిన వెంకటేశ్. డిగ్రీ వరకు చదువుకుని మార్షల్ ఆర్ట్స్ విభాగంలోని తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించిన వెంకటేశ్... 2007లో జాతీయ రెఫరీ కోర్సు పూర్తి చేశారు. 2003 నుంచి కడప మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న వెంటేశ్... మూడేళ్ల నుంచి కడప రామకృష్ణ పాఠశాల మైదానంలో మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తున్నారు.
ఆత్మరక్షణ విభాగాల్లో తర్ఫీదు
ప్రధానంగా తైక్వాండో, జిత్ కొనెడో, రెజ్లింగ్, సెలంబం(కర్రసాము), శాంబో, బల్లెం, కత్తి (స్క్వాడ్), నాంచాక్ వంటి ఆత్మరక్షణ విభాగాల్లో విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా మార్షల్ ఆర్ట్స్ మెళకువలు నేర్పుతున్నారు. ప్రస్తుతం 25 మంది విద్యార్థులు వెంకటేశ్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు.
శిష్యుల విజయాలు
వెంకటేశ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న విద్యార్థులు... రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో తమ ప్రతిభను చాటుతున్నారు. ఇప్పటి వరకూ 12 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని బంగారు, రజత, కాంస్య పతకాలు సాధించారు. వీరిప్పుడు జాతీయ స్థాయి పోటీలకు సిద్ధమవుతున్నారు. ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు శిక్షణ ఇస్తూ... రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించేందుకు తన వంతు కృషి చేస్తున్నానంటున్నారు శిక్షకుడు వెంకటేశ్.
ప్రతిభ ఉన్న విద్యార్థులకు మెళకువలు నేర్పి... జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. ఎప్పటికైనా జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలనే పట్టుదలతో శిక్షణ అందిస్తున్నారు. తమ శిక్షకుడి శ్రమకు నైపుణ్యత జోడించి మరింత రాణిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.
ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే మరింతగా మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతానని ధీమావ్యక్తం చేస్తున్నారు వెంకటేశ్.
ఇదీ చదవండి :యంత్రవిద్యకు ఊతం...ఏయూ నైపుణ్యాభివృద్ధి కేంద్రం