ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడపలో మామిడి వ్యాపారానికి దళారీ వైరస్‌

దుక్కులు దున్ని, ఎరువులు, నీళ్లుపెట్టి, పురుగుమందులు కొట్టి ఏడాదంతా పంటను కాపాడే రైతుకు తీరా దిగుబడి చేతికందే సమయానికి ‘దళారీ’ వైరస్‌ సోకుతోంది. కడప జిల్లాలో కరోనా లాక్​డౌన్​ సడలింపులతో కొంత మెరుగవుతున్న మార్కెటింగ్​ ... దళారులు మాత్రం తమను దోచుకుంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

By

Published : Jun 15, 2020, 10:59 AM IST

mango business problems at kadapa district
కడపలో మామిడి వ్యాపారానికి దళారీ వైరస్‌

మామిడికాయలు

దుక్కులు దున్ని, ఎరువులు, నీళ్లుపెట్టి, పురుగుమందులు కొట్టి ఏడాదంతా పంటను కాపాడే రైతుకు తీరా దిగుబడి చేతికందే సమయానికి ‘దళారీ’ వైరస్‌ సోకుతోంది. ప్రస్తుతం మామిడి సీజన్‌ నడుస్తోంది. జిల్లాలోని రైల్వేకోడూరు, రాజంపేట, రాయచోటి, బద్వేలు, జమ్మలమడుగు, పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఈ వ్యాపారం జోరుగా ఉంటుంది. ఈ ఏడాది సరైన వర్షాలు కురవకపోవడంతో దిగుబడి మందగించింది. పరిస్థితులు సాధారణంగా ఉంటే జిల్లా మొత్తంపై 30 వేల హెక్టార్లలో ఏటా 3.5 లక్షల టన్నుల దిగుబడి లభించేది. ఈ ఏడాది 30 నుంచి 40 శాతం దిగుబడి కూడా దక్కని పరిస్థితి ఎదురైంది. ఏప్రిల్‌, మే నుంచే ప్రారంభం కావాల్సిన వ్యాపారం ఈ నెలలో కొంత ఊపందుకుంటోంది. మామిడికాయల యార్డులకు దిగుబడులు చేరుతున్నాయి. కరోనా లాక్‌డౌన్‌ సడలింపులతో మామిడికి మార్కెటింగ్‌ కొంత మెరుగుపడుతోంది. ఈ సమయంలోనే దళారులు, బడా వ్యాపారులు తమను మరింత దోచుకుంటున్నారని రైతులు వాపోతున్నారు.

బేరాలు - మోసాలు..

తోటల నుంచి మామిడి కాయలను మార్కెట్టుకు తీసుకువచ్చే రైతులకు వాహనంనుంచి సరకు దించకముందే కష్టాలు ఎదురవుతున్నాయి. టన్ను ఎంతకిస్తావంటూ మోహరించే వ్యాపారులు తలాఒక ధర చెబుతూ సాగుదారుడిని తికమక పెట్టేస్తారు. మార్కెట్లో కిలో బేనీషా ధర రూ.40 అనుకుంటే.. రూ.37 మాత్రమే ఉంది నీకైతే ఒక రూపాయి ఎగవేసి రూ.38 లెక్కన ఇస్తాం. కాయలు దించేసెయ్‌.. అంటూ దళారులు చెబుతారు. అంటే అసలు ధరకంటే రూ.2 తగ్గించేస్తారు. దీన్నే ‘లోబేరం(లోలోపల మాట్లాడుకునే బేరం)’ అంటారు. ఇలా రైతు ప్రతి కిలోపైనా తక్కువ ధరనే తీసుకుంటున్నారు. ఇదిగాక ప్రతి టన్నుకు 40 కిలోల ‘సూట్‌’ తీసేస్తారు. అంటే సరకును లారీలకు ఎత్తడం- దించడం - రవాణా సమయంలో దెబ్బతింటాయని చెబుతుంటారు. ఆ నష్టాన్నికూడా రైతుమీదే మోపుతారు. అడుగడుగునా మోసం కళ్లముందే తెలుస్తున్నా ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఏంచేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోకల్‌ కూలీలకు గిరాకీ

మామిడి సీజన్‌ వచ్చిందంటే అనంతపురం, కర్నూలు, మహారాష్ట్ర వంటి ఇతర ప్రాంతాలు, జిల్లాల కూలీలకు ఇక్కడ నాలుగైదు నెలలవరకు పనులు లభించేవి. కాయల కోతల నుంచి - గ్రేడింగ్‌, లోడింగ్‌దాకా అన్నీ వారే చేసేవారు. ఈ ఏడాది కరోనా ప్రభావంతో ఇతర ప్రాంతాల కూలీల జాడేలేదు. దీంతో ఆయా ప్రాంతాలకు చెందిన స్థానిక కూలీలకు మంచి గిరాకీ ఏర్పడింది. పది టన్నులు గ్రేడింగ్‌ చేస్తే రూ.400, ఒక టన్ను లోడింగ్‌ చేస్తే రూ.300 చొప్పున కూలీలు గిట్టుబాటవుతుండడంతో వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఐదెకరాలకు రూ. 3 లక్షల ఖర్చు

దుక్కులు, ఎరువులు, నాలుగుసార్లు పురుగుమందులు, వాటికి కూలీలు.. ఇలా ఐదెకరాల తోటకు రూ.3 లక్షలు ఖర్చుపెడుతున్నాం. సరైన వర్షాలు లేక దిగుబడి తగ్గిపోయింది. దానికితోడు ఈ వ్యాపారులు, దళారుల బేరసారాలతో కనీసం పెట్టుబడికూడా దక్కడం లేదు. రైతుల తోటల్లోకి వెళ్లి వ్యాపారులు కొనుగోలు చేసే పరిస్థితి రావాలి. రైతులే తమ పంటలకు గిట్టుబాటు ధరలను నిర్ణయించుకోగలగాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడంలేదు.

ఏమీ అడగలేని పరిస్థితి

కాయలను మార్కెట్టుకు తీసుకువచ్చాక దళారులు, వ్యాపారులు ఎంతచెబితే అంతే. గట్టిగా మాట్లాడితే వాటిని ఎవరూ కొనడంలేదు. సూటు, లోబేరం అంటూ సగానికి సగం ధరలు తగ్గించేస్తున్నారు. వాళ్లుమాత్రం మంచి లాభాలకు ఎగుమతి చేసుకుంటున్నారు. కష్టపడిన రైతులకు లాభాలు దక్కడంలేదు. గ్రేడింగ్‌ ప్రక్రియలో పక్కన పడేసిన బేనీషా కాయలు. వీటిని రైతులు తక్కువ ధరలకు చిరు వ్యాపారులకు అమ్ముకుంటున్నారు.

ఇవీ చూడండి:ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్​పై నేడు విచారణ.

ABOUT THE AUTHOR

...view details