‘మా కుటుంబంలో నాతో కలిపి నలుగురు వ్యక్తులు వారంరోజుల క్రితం కరోనా బారిన పడ్డాం. అనుమానిత లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్లో ఉంటున్నాం. పాజిటివ్ వచ్చి ఒక రోజు గడిచిపోయినా ప్రభుత్వం అందించే కిట్ అందకపోవడంతో 104 కాల్సెంటరును సంప్రదించి సమస్యను తెలియజేశా. తర్వాత ప్రతిరోజూ జిల్లా యంత్రాంగం తరఫున ఎవరో ఒకరు ఫోన్చేసి మా బాగోగులు అడుగుతున్నారే తప్ప కిట్లు ఎప్పుడిస్తారంటే సరైన స్పందన లేదు. రెండురోజుల క్రితం స్థానిక వైద్య సిబ్బంది వచ్చి నలుగురికి కేవలం ఒక్క కిట్ ఇచ్చి వెళ్లారు. ఇదేంటని అడిగితే కిట్లు అందుబాటులో లేవని చెప్పారు’ అని కడప నగరం మరియాపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి చెప్పారు.
‘నాకు మూడురోజుల క్రితం కరోనా సోకడంతో హోం ఐసోలేషన్లో ఉంటున్నా. ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున కిట్ అందజేయలేదు. నాకు పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో ప్రైవేటుగా కూడా ఔషధాలు తీసుకోవట్లేదు’ అని ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఒక యువకుడు పేర్కొన్నారు.
‘నాకు గత వారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొద్దిగా నీరసంగా ఉండడంతో ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నా. ఇప్పటివరకు హోం ఐసోలేషన్ కిట్ అందించలేదు. దీనిపై స్థానిక వైద్య సిబ్బందిని అడిగినా స్పందన లేదు. చేసేదేమీలేక రూ.వెయ్యి ఖర్చుపెట్టి మందులు తెచ్చుకుని వాడుతున్నా’ అని కడప నగరానికి చెందిన ఒక మహిళ తెలిపారు.
‘ఈ నెల 2వ తేదీన నాకు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు నాకు కిట్ అందించలేదు. ప్రభుత్వం ఉచితంగా అందించే ఔషధాల కోసం ఎదురుచూస్తున్నా’ అని కడప నగరం ఎర్రముక్కపల్లెకు చెందిన ఒక వ్యక్తి చెప్పారు.
కడప జిల్లాలో చాలామంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. అనుమానిత లక్షణాలు కనిపించకపోయినా, శ్వాస సమస్యలు, ఇతర ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకపోతే హోం ఐసోలేషన్లోనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు భారీ సంఖ్యలో కొవిడ్ రోగులు ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు. జిల్లాలో మంగళవారం నాటికి 5,639 క్రియాశీలక కేసులు ఉండగా.. ఇందులో 4,020 మంది హోం ఐసోలేషన్లోనే ఉంటున్నారు. వీళ్లందరికీ ప్రభుత్వం తరఫున ఉచితంగా కిట్లు అందజేయాల్సి ఉన్నా.. క్షేత్రస్థాయిలో కొందరికి అందట్లేదు. రోగుల్లో ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు తదితర లక్షణాలతో ఉంటున్నారు. సకాలంలో మందులు అందితే త్వరగా కోలుకునే వీలుంటుంది. పాజిటివ్ వచ్చిందని నేరుగా రోగి ఫోన్ చేసి చెప్పినా సాంకేతిక కారణాలతో కొన్ని చోట్ల కిట్ల పంపిణీ ఆలస్యం అవుతోంది.