ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కడప జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ధ్వజమెత్తారు. రిమ్స్లో రోగులకు ప్రాణవాయువు అందక చనిపోవటం దారుణమన్నారు. స్వయాన సీఎం సొంత జిల్లాలోనే పరిస్థితులు సరిగా లేకుంటే ఇతర జిల్లాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని విమర్శించారు.
'శానిటైజర్ తాగి మృతి చెందిన కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలి' - కడపలో శానిటైజర్ల తాగి ముగ్గురు మృతి
కడప రిమ్స్ ఆస్పత్రిలో ప్రాణవాయువు అందక రోగులు మృతి చెందడం దారుణమని కడప జిల్లా తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ధ్వజమెత్తారు. కడపలో శానిటైజర్లు తాగి మృతి చెందిన కుటుంబాలకు 10 లక్షల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే మూడు రాజధానుల ప్రస్తావన అవసరమా అంటూ నిలదీశారు.

రాష్ట్రంలో మద్యం ధరలు పెరగటంతో మద్యానికి బానిసైనవారు డబ్బుల్లేక శానిటైజర్లు తాగి చనిపోతున్నారని ఆరోపించారు. కడపలో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారన్నారు. తక్షణం మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 10 లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల్లోని కలెక్టర్లు కరోనా వైరస్ నివారణ కోసం మాత్రలు ఇంటింటికి సరఫరా చేస్తుంటే... కడప జిల్లాలో మాత్రం ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తడం లేదని తెలిపారు. కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే మూడు రాజధానుల ప్రస్తావన ఇప్పుడు అవసరమా అని ఎద్దేవా చేశారు.
ఇవీ చదవండి