కరవు పరిస్థితులు నెలకొన్న కడప జిల్లాలో ఉపాధి కోసం సొంత ఊళ్లు వదిలి గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడే సంఘటనలు ఎన్నో దర్శనమిస్తున్నాయి. గత కొంత కాలంగా జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అలా వెళ్లిన వారిలో ఆర్థికంగా చితికిపోయి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. అలాంటి కష్టమే సయ్యద్ అలీ అనే కుటుంబాని వెంటాడుతోంది. కువైట్ వెళ్లిన సయ్యద్ తిరిగి వస్తాడా.? అసలు చూస్తామా అనే ఆవేదనలో ఉంది అతని కుటుంబం.
కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం రెడ్డివారి పల్లెకు చెందిన సయ్యద్ అలీ ఐదేళ్ల కిందట గల్ఫ్ దేశమైన కువైట్ వెళ్లారు. ఎడారిలో జీవాలను మేపుతూ... వచ్చిన వేతనాన్ని ఇంటికి పంపి తల్లీ తండ్రి, భార్య పిల్లలను పోషించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ 2016 జూన్ 10 తర్వాత సయ్యద్ అలీ నుంచి ఇంటికి ఫోన్ రాలేదు. ఆయన ఎక్కడున్నాడు..ఎలా ఉన్నాడు తెలియడం లేదు. నాటి నుంచి ఆ పేద కుటంబం తల్లిడిల్లిపోతోంది.