కడప జిల్లా వీరబల్లి మండలం సానిపాయ గ్రామం జింకా దళితవాడకు చెందిన.. దళితుల భూములపై పెద్దల కన్నుపడింది. 5 దశాబ్దాలుగా దళితుల సాగు చేసుకుంటున్న భూములను గుట్టుచప్పుడు కాకుండా, కొందరు రాజకీయ నేతల అండదండలు ఉన్నవారు పట్టాలు పొంది.. పొలాల్ని చదును చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఊహించని పరిణామంతో దళితులకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.
ప్రభుత్వం ఇటీవల నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ముమ్మరం చేయటంతో.. రాయచోటి-రాజంపేట ప్రధాన రహదారిపై ఉన్న భూములపై పెద్దలు దృష్టి సారించారు. రాజంపేట జిల్లా అయితే భూములు విలువ పెరుగుతుందని భావించిన కొందరు... జింకాదళిత వాడకు పక్కనే ఉన్న 60 ఎకరాల భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని దళితులు ఆరోపించారు.
ఈ భూమిపైనే 40 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని బాధితులు వాపోయారు. ఇటీవల వచ్చిన కరువు కారణంగా భూమిని సాగు చేయలేక కూలి పనులకు వెళ్తున్నామనీ... ఇంతలోనే తమ భూమిని ఆక్రమించుకోవటానికి పెద్దలు వచ్చారని ఆరోపించారు.