Viveka murder case: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. పులివెందుల ఆర్అండ్బీ అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా ఇంట్లో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఇనయతుల్లాను అధికారులు విచారించారు. వివేకా హత్య జరిగిన రోజు ఆయన బెడ్ రూమ్తో పాటు, బాత్ రూమ్లో పడి ఉన్న మృతదేహాన్ని ఇనయతుల్లానే ఫొటోలు, వీడియోలు తీశారు. అతని వద్ద నుంచి కీలక సమాచారాన్ని తీసుకోవడానికి అధికారులు ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. వివేకా హత్య కేసులో అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివ ప్రకాశ్రెడ్డితో పాటు మరికొందరిని విచారించాలని శివశంకర్ రెడ్డి భార్య దాఖలు చేసిన పిటిషన్పై పులివెందుల న్యాయస్థానం విచారించింది. పిటిషనర్ తులశమ్మ పేర్కొన్న విధంగా రాజశేఖర్ రెడ్డి, శివ ప్రకాశ్ రెడ్డి, బీటెక్ రవి, కొమ్మా పరమేశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్లపై సీబీఐ విచారణ జరిపే విధంగా ఆదేశాలివ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న న్యాయస్థానం..పూర్తి వివరాలతో తులశమ్మ వాంగ్మూలం నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను ఆగస్టు 30కి వాయిదా వేసింది.