ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 14, 2023, 7:40 PM IST

Updated : Mar 14, 2023, 7:49 PM IST

ETV Bharat / state

చెరువులా అండర్​ బ్రిడ్జి... రాకపోకలు సాగించలేక గ్రామస్థుల అవస్థలు

WATER UNDER THE BRIDGE: వైయస్సార్ కడప జిల్లా కమలాపురం మండలంలోని సి. గోపులాపురం గ్రామంలో బ్రిడ్జి కింద నీరు చేరటం వల్ల రాకపోకలు సాగించలేక గ్రామస్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ఎంత మంది అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా నామమాత్రంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. దీంతో వారే తమ సొంత ఖర్చుతో బ్రిడ్జి కింద నీటిని తొలగిస్తున్నామని.. అయితే అధికారులు ఇప్పటికైనా తమ సమస్యను గుర్తించి శాశ్వత పరిష్కారం చూపించాలంటూ గ్రామస్థులు వేడుకొంటున్నారు.

బ్రిడ్జి కింద చేరిన నీటిని తొలగిస్తున్న గ్రామస్థులు
బ్రిడ్జి కింద చేరిన నీటిని తొలగిస్తున్న గ్రామస్థులు

బ్రిడ్జి కింద చేరిన నీటిని తొలగిస్తున్న గ్రామస్థులు

WATER UNDER THE BRIDGE: వైయస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం సి. గోపులాపురం గ్రామంలో బ్రిడ్జి కింద చేరిన నీరు కారణంగా గ్రామస్థులు రాకపోకలు సాగించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య గురించి అధికారులకు, రాజకీయ నాయకులకు పలుమార్లు తెలిపినప్పటికీ వారు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారే తప్ప.. శాశ్వత పరిష్కారం చూపట్లేదని గ్రామస్థులు వాపోయారు. దీంతో చేసేదేమీ లేక గ్రామ ప్రజలే తమ సొంత ఖర్చులతో ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుని నీటిని తొలగించే ప్రయత్నాలు చేపట్టారు. గ్రామానికి ఒకవైపు వంక మరోవైపు అండర్ బ్రిడ్జి ఉండటం వల్ల ఎటువైపూ పోలేక ఇబ్బందులు పడుతున్నామని వారు తెలిపారు.

ఈ సమస్యపై పలుమార్లు రైల్వే అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదని, అధికారులకు తెలిపినప్పుడు వారు నామమాత్రంగా నీటిని తొలగించి వెళ్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు నీటిని తొలగించినా మళ్లీ రెండు రోజులకు బ్రిడ్జి కిందకి నీరు వచ్చి చేరుతుందని వాపోతున్నారు. అయితే ఈ విషయాన్ని పలుమార్లు రైల్వే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తే.. నీళ్లు వెళ్లేందుకే ఈ బ్రిడ్జి.. ప్రజలు తిరగటానికి కాదని వారు అంటున్నారని స్థానికులు ఆరోపించారు. అలా అయితే తమ గ్రామానికి రాకపోకలు ఎలా సాగించాలి? మాకు దారి ఎక్కడుందో ప్రభుత్వాలే తెలియజేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అండర్ బ్రిడ్జి కింద నీరు పోయే ఏర్పాటు చేస్తే రాకపోకలు సాగుతాయని.. లేదంటే ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఎన్ని రాజకీయ పార్టీల అధికారుల చుట్టూ తిరిగిన ప్రయోజనం లేదని అంటున్నారు. గోపులాపురం గ్రామంలో దాదాపు 100 కుటుంబాలు, 400కు పైగా జనాభా ఉన్నారు. ఆ గ్రామంలో బ్రిడ్జి కింద చేరిన నీటి కారణంగా స్కూలుకు వెళ్లే విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు చేసేదేమీ లేక స్కూలుకు వెళ్లే విద్యార్థులను కడప తాడిపత్రి ప్రధాన రహదారి వద్దకు వెళ్లి వదిలిపెట్టి వస్తున్నామని వారి తల్లిదండ్రులు తెలిపారు. గ్రామంలో ఆరోగ్య సమస్యలు తలెత్తితే అంబులెన్స్​లు రావటానికి కూడా మాకు మార్గం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమస్యను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లినా.. పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు తప్ప ఆచరణ సాధ్యం కాలేదని గ్రామస్థులు అంటున్నారు. గ్రామంలో గంగమ్మ జాతర నిర్వహించుకోవాల్సి ఉండగా.. బ్రిడ్జి కింద నీరు ఉండడం వల్ల తమ ఇంటికి వచ్చే చుట్టాలకు ఇబ్బందిగా ఉంటుందని తామే స్వయంగా నీటిని తొలగించుకునే ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఈ సమస్యపై అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్థులు కోరుతున్నారు.

"మా గ్రామంలోని సమస్యను ఎంత మంది అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా వారు దీనికి శాశ్వత పరిష్కారం చూపట్లేదు. అయితే మా గ్రామంలో గంగమ్మ తల్లి జాతర ఉన్న కారణంగా.. మేమే మా సొంత డబ్బులు ఖర్చుపెట్టి బ్రిడ్జి కింద నీటిని తొలగిస్తున్నాము. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాము." - నవనీశ్వర్ రెడ్డి, గ్రామస్థుడు

Last Updated : Mar 14, 2023, 7:49 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details