రాష్ట్రంలో అధర్మ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో భాజపా జిల్లా కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ దౌర్జన్యంగా జరుగుతోందన్న ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి చోట అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు.
గ్రామీణ ఉపాధి డబ్బులు 90% కేంద్రం ఇస్తున్నా.. రాష్ట్రంలో మూడేళ్ల నుంచి బిల్లులు పెండింగ్ పెట్టారని ఆరోపించారు. ప్రొద్దుటూరులో అనుమతి లేకుండా టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటుకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి శంకుస్థాపన చేశారని.. నా ఇష్టం.. నా రాజ్యమన్న ధోరణిలో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని ఆగ్రహించారు.