ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 27, 2021, 7:01 PM IST

Updated : Oct 27, 2021, 8:01 PM IST

ETV Bharat / state

Badvel bypoll: ముగిసిన ప్రచారం.. బయటి వ్యక్తులు ఉండొద్దని ఈసీ ఆదేశాలు

ముగిసిన బద్వేలు ఉపఎన్నిక ప్రచారం
ముగిసిన బద్వేలు ఉపఎన్నిక ప్రచారం

15:41 October 27

ఈనెల 30న ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకు పోలింగ్‌

బద్వేలు ఉపఎన్నిక(badvel bypoll 2021 news) ప్రచారం ముగిసింది. ఈనెల 30న జరగనున్న పోలింగ్ కోసం నియోజకవర్గంలో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో స్థానికులు మాత్రమే ఉండాలని, ఇతర ప్రాంతాల వారంతా వదిలి వెళ్లిపోవాలని ఆంక్షలు విధించారు. లాడ్జిలు,హోటళ్లు సమావేశ మందిరాలన్నింటినీ తనిఖీ చేస్తున్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్..
పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. పోలింగ్ కేంద్రానికి ఓటరు స్లిప్పుతో పాటు గుర్తింపు కార్డు తప్ప ఇతరత్రా సామాగ్రి ఎలాంటివి తీసుకెళ్ల రాదని స్పష్టం చేశారు. 48 గంటల ముందు నుంచి మద్యం దుకాణాలు అన్నింటిని మూసివేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వారందరూ తిరిగి వెళ్లిపోవాలని పేర్కొన్నారు. ఎవరైనా గొడవలు సృష్టించాలని చూస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సివిల్, ఆర్మీ రిజర్విడ్, స్పెషల్ పార్టీ పోలీసులు తో పాటు హోంగార్డులను ఉపయోగించుకుంటున్నారని పేర్కొన్నారు. సిసి కెమెరాలను, వెబ్ కెమెరాలను ఉపయోగిస్తున్నా మని పోలీస్ నిఘా కట్టుదిట్టంగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. అయితే పోలింగ్ (badvel bypoll) ఈ నెల 30  ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు జరగనుంది. ఉపఎన్నిక కోసం 281 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈవీఎంల ద్వారా అధికారులు పోలింగ్ నిర్వహించనున్నారు.

'ఈనెల 30న బద్వేలు ఉపఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశాం.  బద్వేలు ఉపఎన్నికకు 281 పోలింగ్ కేంద్రాలు. పోలింగ్‌ కోసం 1,124 మంది సిబ్బంది సేవలు అందిస్తారు.  ఈనెల 29న సిబ్బందికి పోలింగ్ సామగ్రి పంపిణీ చేస్తాం. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ ఏర్పాటు ఉంటుంది. ప్రతి ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. సి-విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటాం' - కడప జిల్లా కలెక్టర్‌

'బద్వేలు ఉపఎన్నిక దృష్ట్యా మూడంచల బందోబస్తు ఏర్పాటు చేశాం. ఉపఎన్నిక సందర్భంగా 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు ఉంటుంది. బయటి వ్యక్తులు బద్వేలు నియోజకవర్గంలో ఉండరాదు. బద్వేలుకు కొత్త వ్యక్తులు వస్తే ఫిర్యాదు చేయాలి' - జిల్లా ఎస్పీ అన్బురాజన్

కోడ్ ఉల్లంఘిస్తే  కేసులు: ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్
బద్వేలు ఉప ఎన్నిక (badvel bypoll) నిర్వహణపై కడప జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్సు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు కర్నూలు రేంజ్ డీఐజీ, మంగళగిరి పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి శాంతిభద్రతల అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్ సహా రిటర్నింగ్ అధికారులు హాజరయ్యారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఎన్నికల ప్రధానాధికారి ఆదేశాలు జారీ చేశారు. సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మొహరించాల్సిందిగా సూచనలిచ్చారు. మోడల్ కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి కేసులు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు. మరోవైపు ఇప్పటి వరకూ ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఐదు కేసులు నమోదు చేసినట్టుగా వాటిపై విచారణ జరుపుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

బరిలో 15 మంది..
బద్వేలు అసెంబ్లీ స్థానానికి గత రెండు దశాబ్దాల్లో జరిగిన ఎన్నికల్లో.. అత్యధికంగా ఈసారే 15 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ స్థానానికి చివరిసారిగా 2001లో ఉప ఎన్నిక నిర్వహించగా.. అప్పుడు 14 మంది పోటీలో నిలిచారు. అనంతరం 2004లో ఆరుగురు, 2009లో 12 మంది, 2014లో 13 మంది, 2019లో 14 మంది అభ్యర్థులు పోటీలో మిగిలారు.

ఉపఎన్నిక బరిలో నిలిచిన 15 మంది అభ్యర్థుల్లో 41-50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 30-40 ఏళ్ల మధ్య అయిదుగురు, 41-50 ఏళ్ల మధ్య ఆరుగురు, 51-60 ఏళ్ల మధ్య ఇద్దరు, 60-65 ఏళ్ల మధ్య ఇద్దరు ఉన్నారు. అత్యధికంగా 65 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులుగా కాంగ్రెస్‌ నుంచి కమలమ్మ, నవరంగ్‌ కాంగ్రెస్‌ నుంచి సింగమల వెంకటేశ్వర్లు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థి జె.రాజేష్‌ (33) అతి చిన్న వయస్కుడిగా ఉన్నారు.

సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఆయన భార్య సుధను ప్రకటించడంతో సంప్రదాయాన్ని పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షం తెదేపా, జనసేన పోటీ నుంచి తప్పుకొన్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ మంది అభ్యర్థులు తుది పోటీలో ఉంటారని చాలామంది భావించారు. అయితే.. అందుకు విరుద్ధంగా గత 20 ఏళ్లలో జరిగిన ఎన్నికల్లో ప్రస్తుతమే ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో నిలవడం విశేషం.

ఇతర నియోజకవర్గాల్లో నివాసం..
బద్వేలు ఉపఎన్నిక అభ్యర్థుల్లో ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో నివసిస్తున్నవారు ఏడుగురు ఉన్నారు. వైకాపా అభ్యర్థి దాసరి సుధ కడప నగరంలోని క్రిస్టియన్‌ లేన్‌లో.. భాజపా అభ్యర్థి పనతల సురేష్‌ రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం పొందలూరు హరిజనవాడలో నివసిస్తున్నారు. ఈ జాబితాలో గుంటూరు జిల్లా రొంపిచెర్ల మండలానికి చెందిన నవతరం పార్టీ అభ్యర్థి రమేష్‌కుమార్, కర్నూలు జిల్లా పగిడ్యాల మండలానికి చెందిన ఇండియా ప్రజాబంధు పార్టీ అభ్యర్థి నాగరాజు, కడప నగరానికి చెందిన మహాజన రాజ్యం పార్టీ అభ్యర్థి మనోహర్, స్వతంత్ర అభ్యర్థులు రాజేష్, హరిప్రసాద్‌ ఉన్నారు.

త్రిముఖ పోరు ఖరారు..
ప్రధాన ప్రతిపక్షం తెదేపాతోపాటు జనసేన పోటీ నుంచి తప్పుకోవడంతో ఈ ఉప ఎన్నికల్లో వైకాపా, కాంగ్రెస్, భాజపా మధ్య ప్రధానంగా పోటీ నడుస్తోంది. మరికొన్ని చిన్న రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రభావం చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  


ఇదీ చదవండి:

నీరజ్​ చోప్రా, మిథాలీ రాజ్​కు ఖేల్​రత్న- ధావన్​కు అర్జున!

Last Updated : Oct 27, 2021, 8:01 PM IST

ABOUT THE AUTHOR

...view details