ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 13, 2020, 10:56 AM IST

ETV Bharat / state

'వైయస్సార్ ఆసరా పథకం' అమలుకు చర్యలు ప్రారంభం

స్వయం సహాయక సంఘాల రుణమాఫీకి ప్రవేశపెట్టిన వైయస్సార్ ఆసరా పథకం పకడ్బందీగా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా కసరత్తు ప్రారంభించారు.

ysr aasara scheme in ap state
'వైయస్సార్ ఆసరా పథకం' అమలుకు చర్యలు ప్రారంభం

స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలను 4 వాయిదాల్లో చెల్లిస్తామని ఎన్నికల సమయంలో సీఎం జగన్​మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 2019 ఏప్రిల్ 11 నాటికి సంఘాల అప్పు నిల్వలను చెల్లిస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు బ్యాంకుల నివేదికల ఆధారంగా సంఘాల వారీగా అప్పు నిల్వలను ఆన్​లైన్​లో నమోదు చేశారు. తాజాగా సంఘాల వారీగా కాక వ్యక్తిగత ఖాతాల్లో రుణమాఫీ సొమ్మును జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో సంబంధిత సిబ్బంది మహిళలతో సమావేశమై వివరాలను నమోదు చేస్తున్నారు. ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, చరవాణి నెంబరు సేకరించి ఆన్​లైన్​లో పెడుతున్నారు. ఈనెల 20వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు.

పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 86,800 స్వయం సహాయక సంఘాలు ఉండగా 72,464 సంఘాలు వైయస్సార్ ఆసరా పథకానికి అర్హత సాధించాయి. నిర్ణయించిన తేదీ నాటికి ఈ సంఘాలకు అప్పు నిల్వలు 2755.08 కోట్ల రూపాయలు ఉన్నట్లు అధికారులు నిర్ధరించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. ఈ మొత్తంలో నాలుగో వంతు 688. 77 కోట్ల రూపాయలను సెప్టెంబర్ 11వ తేదీన స్వయం సహాయక సంఘాల సభ్యుల వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయనున్నారు.

మొత్తం 63 వేల సంఘాలు అర్హత

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 74 వేల స్వయం సహాయక సంఘాలకు 63 వేల సంఘాలు రుణమాఫీకి అర్హత పొందాయి. వీరికి మొత్తం రూ. 2450 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా.. తొలివిడతగా రూ. 612.50 కోట్ల రూపాయలు అందించనున్నారు. పట్టణాల్లో రుణమాఫీకి అర్హత పొందిన 9,464 సంఘాలకు రూ. 76.27 కోట్లు మాఫీ చేయనున్నారు.

కార్పొరేషన్ల ద్వారా చెల్లింపులు

రుణమాఫీ సొమ్మును లబ్ధిదారులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు తదితర 12 కార్పొరేషన్ల ద్వారా చెల్లించనున్నారు. వైయస్సార్ ఆసరా పథకంలో అర్హులైన మహిళలందరికీ రుణమాఫీ అందేలా చర్యలు తీసుకుంటున్నామని.. సిబ్బంది పారదర్శకంగా వివరాలు సేకరిస్తున్నారని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి..

ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details