ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చే'నేతన్న' నేస్తం.. అర్హులైనా అందని ఆపన్న హస్తం..! - nethanna nestham scheme restrictions news

అనాదిగా వారు నేతపనిపై ఆధారపడి జీవిస్తున్నారు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. లాక్​డౌన్​ వారిని మరింత కుంగదీసింది. అయితే వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ప్రవేశపెట్టినా.. అధికారుల నిబంధన వేలాది మంది అర్హులను పథకానికి దూరం చేసింది. పశ్చిమగోదావరి జిల్లాలో చేనేత కార్మికుల ఇబ్బందులపై ప్రత్యేక కథనం..!

చే'నేతన్న' నేస్తం.. అర్హులైనా అందని ఆపన్న హస్తం..!
చే'నేతన్న' నేస్తం.. అర్హులైనా అందని ఆపన్న హస్తం..!

By

Published : Jun 3, 2020, 6:32 AM IST

లాక్​డౌన్ వల్ల చేనేత రంగం కుదేలయ్యింది. నేతపనిపైనే ఆధారపడిన వేలాది మంది చేనేత కార్మికులు రోడ్డునపడ్డారు. కనీసం ప్రభుత్వ పథకాలైనా ఆదుకుంటాయని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. పశ్చిమగోదావరి జిల్లాలో అర్హులైన చేనేతలకు ప్రభుత్వ పథకాలు చేరడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు ఆర్థిక సహాయం అందించేందుకు వైఎస్​ఆర్​ నేతన్న నేస్తం పేరిట పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని కింద చేనేత కార్మికునికి ఏడాదికి రూ.24 వేలు అందజేస్తారు.

సొంత ఇళ్లలో మగ్గం నేసేవారికి మాత్రమే

సొంత ఇళ్లల్లో మగ్గం నేసే వారికి మాత్రమే పథకం వర్తింప చేస్తామని అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం కేవలం 25 శాతం మందికి మాత్రమే ఫలితం దక్కింది. మాస్టర్​ వీవర్ కింద పనిచేసే చేనేత కార్మికునికి ఈ పథకం వర్తింపచేయలేదు. జిల్లాలో వేలాది మంది కార్మికులు మాస్టర్ వీవర్ కింద పనిచేస్తున్నారు. మాస్టర్ వీవర్ యజమాని ఐదారు మగ్గాలు వేసి.. చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నారు. అయితే ఇక్కడ రోజంతా మగ్గం నేసినా చేతికి కనీసం రూ.200 కూలీ కూడా రావడం లేదు. తమ ఇళ్లలో సొంత మగ్గంపై నేతపని చేసే కార్మికులు జిల్లాలో తక్కువగా ఉన్నారు. దశాబ్దాలుగా మగ్గంపై చేనేత పని చేస్తున్నా.. తమకు నేతన్న నేస్తం ఎందుకు వర్తించదని చేనేత కార్మికులు ప్రశ్నిస్తున్నారు.

85 శాతం మందికి లేదు

జిల్లాలో నరసాపురం, ఏలూరు, యలమంచిలి, పాలకొల్లు, అత్తిలి, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో చేనేత మగ్గాలు ఉన్నాయి. దాదాపు 24 వేల మంది చేనేత కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. నూలుదారం రాట్నం వడకడం, రంగులు వేయడం, డైయింగ్, పడుగ తయారీ వరకు వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. చేనేత అంటే మగ్గంపై నేతపని చేసే వారే అన్న రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారు. ఈ ధోరణితో దాదాపు 85 శాతం మందికి పథకం వర్తించలేదు.

శూన్యహస్తమే..!

లాక్​డౌన్​ వల్ల చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన నేతన్న నేస్తం పథకం అమలైతే తమకు ఆసరాగా ఉంటుందని అనుకున్నా వేలాది మందికి శూన్యహస్తమే మిగిలింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని విభాగాల్లో పనిచేసే చేనేత కార్మికులకు నేతన్న నేస్తం వర్తింపచేయాలని చేనేత కార్మికులు కోరుతున్నారు.

చే'నేతన్న' నేస్తం.. అర్హులైనా అందని ఆపన్న హస్తం..!

ఇదీ చూడండి..

మొబైల్​ క్వారంటైన్​ బస్సులు.. త్వరగా కరోనా పరీక్షలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details