రాజకీయ కక్ష సాధింపు, కమీషన్ల కోసమే పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మాదవాయిపాలెం రేవులో పడవలు, పంటుల రాకపోకల్ని ప్రభుత్వం నిలిపివేసిందని.. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడులు ఆరోపించారు. రేవులో రాకపోకల్ని పునరుద్ధరించాలని తెదేపా ఆధ్వర్యంలో వశిష్ట గోదావరి నది పంటుపై ధర్నా నిర్వహించారు.
వారు మాట్లాడుతూ .. రాష్ట్రంలో అన్ని రేవుల్లో పడవల రాకపోకలు సాగుతుంటే ఇక్కడ వైకాపా నేతలు కక్ష సాధింపుతో 9 నెలలుగా రేవుని మూసివేయించారని ఆరోపించారు. దీనివల్ల ఉభయ గోదావరి జిల్లాల్లో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదన్నారు. అధికారులూ వారికే వత్తాసు పలుకుతున్నారని.. ఇదిలానే కొనసాగితే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. పంటుల రాకపోకల్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.