దేశవ్యాప్తంగా జల్జీవన్ మిషన్ కార్యక్రమం కింద కొత్తగా 4 కోట్ల గ్రామీణ ఇళ్లకు కుళాయి నీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి శాఖ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 2024 నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లకు పూర్తిగా కుళాయినీరు అందించాలన్న లక్ష్యంలో ఇప్పటివరకు 1/3 వంతు పూర్తి చేసినట్లు వెల్లడించింది. గ్రామాల్లో 100% ఇళ్లకు కుళాయినీరు అందించిన ప్రథమ రాష్ట్రంగా గోవా, ఆ తర్వాత స్థానాలను తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు దక్కించుకున్నాయని తెలిపింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడు మండలం కకిస్నూర్ గ్రామానికి కుళాయి నీరు అందించడాన్ని జల్శక్తిశాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ‘దట్టమైన అడవుల మధ్య కొండప్రాంతంలో రహదారులు, విద్యుత్తుకు దూరంగా ఉన్న ఈ గ్రామంలోని 200 మందికి నిరంతరం తాగునీరు అందిస్తున్నాం. దాంతో ఆ గ్రామ ప్రజల ఆరోగ్య కొలమానాలు మెరుగుపడ్డాయి. గోదావరిలో 20 కిలోమీటర్ల దూరంపయనించిన తర్వాత వచ్చే ఈగ్రామంలో.. చేతితో డ్రిల్లింగ్ చేసే యంత్రాలను పడవలో ఎక్కించుకుని వెళ్లి బోరుబావి తవ్వి, దానికి రెండు సౌర విద్యుత్తు పంపులు ఏర్పాటు చేసి మొత్తం గ్రామానికి తాగునీరు అందిస్తున్నామని..’’ జల్శక్తి శాఖ వివరించింది.